విజయవాడలో చిరంజీవి సమైక్యాంధ్ర నినాదం
సమైక్యాంధ్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని ప్రజారాజ్యం పార్టీ అధినేత నిన్న విశాఖపట్నంలో ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందదని చాలా మందికి తెలుసని, అయినా కొందరు పదవుల కోసం, స్వార్థ రాజకీయాలకు ఆ ఉద్యమాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు.
ఈ విషయంలో మొదట్లో తాను తప్పటడుగులు వేశానని, వాటిని సరిదిద్దుకునే అవకాశం కలగడం అదృష్టమని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతాల్లో పర్యటిస్తున్న చిరంజీవి శనివారం విశాఖపట్నం వచ్చారు. వివిధ ప్రాంతాల్లో దీక్షలు చేస్తున్న అఖిలపక్ష నాయకులను కలిసి మద్దతు ప్రకటించారు. 'మీట్ ది ప్రెస్', మేధావుల సదస్సులో మాట్లాడారు. "ఆమరణ నిరాహార దీక్ష చేయడం నాకు అసాధ్యమేమీ కాదు. నేను కూడా దీక్ష ప్రారంభించి ఇక్కడే మంచం మీద పడుకొని ఉంటే మంచిదా? లేక ర్రాష్టవ్యాప్తంగా పర్యటించి ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించడం మంచిదా? మీరే చెప్పండి' అని ప్రశ్నించారు.