బేగంపేట విమానాశ్రయంలో ఫైర్, చార్టర్డ్ ప్లేన్స్ దగ్ధం
హైదరాబాద్లో ఉన్న 16 అగ్నిమాపక కేంద్రాల నుంచి అన్ని యంత్రాలనూ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం నీటిని చల్లి మంటలను ఆర్పలేమన్న ఉద్దేశంతో అత్యాధునికంగా కార్బన్ డయాక్సైడ్ ఫోమ్తో మంటలు ఆర్పే యంత్రాలను రప్పించారు. తొలుత విమానాశ్రయంలో ఉన్న రెండు యంత్రాలతో మంటలు ఆర్పుతుండగానే అవి మరింత విస్తరించాయి. కాగా, అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనపై సిబిసిఐడి దర్యాప్తునకు ఆదేశించారు.
విమానాలు, హెలికాప్టర్లలో ఉపయోగించే వైట్ పెట్రోలుకు మండే గుణం అధికంగా ఉంటుంది. ప్రమాదానికి గురైన షెడ్డులో ఈ ఇంధన బ్యారెళ్లు ఉండటం వల్లనే మంటలు ఎక్కువగా ఎగసిపడినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత పేలుడు శబ్దాలు కూడా వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. అందరూ నిద్రపోతున్న సమయంలో హఠాత్తుగా శబ్దాలు రావడంతో పాటు దట్టమైన పొగలు వ్యాపించడంతో విమానాశ్రయం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉండేవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు.
కిలో మీటరు మేర పొగలు వ్యాపించాయి. శంషాబాద్లో కొత్త విమానాశ్రయం నిర్మాణం పూర్తయిన తర్వాత బేగంపేట నుంచి విమానాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. కేవలం అతి ముఖ్యుల రాకపోకలకు, వైమానిక విన్యాసాలకు మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాంటి విఐపిలు కూడా ఈ విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగిస్తుంటారు.