తెలంగాణలో పట్టుందని పథకంప్రకారమే ధ్వంసం: టిడిపి
ఈ సందర్భంగా తలసాని, దేవేందర్, మహేందర్ రెడ్డిలు మాట్లాడారు. ధ్వంసం చేసిన చోటే వారం రోజుల్లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎవరో ఒకరిద్దరు పతకం ప్రకారమే విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము, తమ కార్యకర్తలం కలిసి నిందితులను గుర్తించి తేల్చుకుంటామన్నారు.
ఎన్టీఆర్ తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా ఎంతో చైతన్యం తీసుకు వచ్చారన్నారు. అలాంటి వ్యక్తిపై దాడి చేయడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. తెలుగువారిపై దాడిగానే గుర్తించవచ్చునని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ బలంగా ఉండటంతో తమను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు కొందరు పాల్పడుతున్నారని విమర్శించారు. ఒకరిద్దరు చేసినంత మాత్రాన ఏమీ కాదన్నారు.
కాగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అల్వాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు కాల్చివేసి ధ్వంసం చేశారు. అల్వాల్లోని జవహర్ నగర్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి కాల్చివేశారు. అనంతరం ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం పూర్తిగా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న టిడిపి శ్రేములు భారీగా సంఘటనా స్థలానికి చేరుకొని నిరసన తెలిపారు.