దొంగల ప్రభుత్వానికి వత్తాసు: టిడిపి, విపక్షం ధ్వజం
అబద్ధాలు చెప్పడం వల్లనే గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించినట్లు తెలుగుదేశం సభ్యులు చెప్పారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు, మోత్కులపల్లి నర్సింహులు, తదితరులు మీడియాతో మాట్లాడారు. దొంగల ప్రభుత్వాన్ని గవర్నర్ తన ప్రభుత్వమని అంటున్నారని వారు విమర్శించారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వారు విమర్శించారు. కాంగ్రెసు గవర్నర్ ఏజెంటుగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. రాజభవన్ను గవర్నర్ గాంధీభవన్గా మార్చేశారని వ్యాఖ్యానించారు. గవర్నర్ తన ప్రసంగంలో గతంలో ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో చెప్పలేదని వారన్నారు. అవినీతి మంత్రలను గవర్నర్ కాపాడుతున్నారని వారు విమర్శించారు.
గవర్నర్ ప్రసంగంలో ప్రజాసమస్యల ప్రస్తావనే లేదని, వాటి పరిష్కారం కోసం ఒక్క సూచన కూడా లేదని సిపిఐ శాసనసభ్యుడు గుండా మల్లేష్ అన్నారు. గవర్నర్ ప్రసంగం సాదాసీదాగా సాగిందని ఆయన విమర్శించారు. హైదరాబాద్లో సైనిక పాలన సాగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇచ్చిన హామీని ఒక్కదాన్ని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన అన్నారు.
గవర్నర్ ప్రసంగాన్ని ఊకదంపుడు ఉపన్యాసంగా సిపిఎ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి కొట్టిపారేశారు. తన ప్రసంగంలో గవర్నర్ కరెంట్ కోతలు లేవని కూతలు కూశారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు లేకపోవడాన్ని తెలంగాణ నగారా సమితి శానససభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి తప్పు పట్టారు. చంద్రబాబు ఎక్కడున్నారని ఆయన అడిగారు. శానససభ సమావేశాల తొలి రోజునే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ప్రజాస్వామ్యంలో సరైంది కాదని ఆయన అన్నారు.
ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని నాగం అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని కాపాడేందుకు కొందరు తెలంగాణ ద్రోహులు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో కాగ్రెసు ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని ఎందుకు పొందు పరచలేదని ఆయన అడిగారు.