పునరాలోచించమని కోరాం, వారిదే డబుల్ గేమ్: బొత్స
అన్ని పార్టీలు విభజన కోసం తమ పార్టీ పైన ఒత్తిడి తెచ్చాయని, ఆ కారణంగానే కాంగ్రెసు నిర్ణయం తీసుకుందని చెప్పారు. చంద్రబాబు స్వయంగా విభజకు అనుకూలంగా మాట్లాడారని, లేఖ ఇచ్చారని కానీ, టిడిపి నేతలు మాత్రం తమను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. ప్రజాగ్రహానికి గురవుతామని ఇప్పుడు తమ పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయవద్దని కోరారు. విగ్రహాలు ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. హైదరాబాదులోని సీమాంధ్ర ఉద్యోగులకు తాము అండగా నిలుస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలు సరికాదన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు తమ వల్ల మంచి జరగాలని చూడాలే తప్ప చెడు జరగాలని చూడవద్దని హితవు పలికారు. ఎవరేం మాట్లాడినా అన్ని నిబంధనల ప్రకారమే జరుగుతాయని చెప్పారు.
రాజధాని ఎక్కడ అనేది ఇప్పుడు అప్రస్తుతమన్నారు. సీమాంధ్రలో ఉన్న ఐదు కోట్ల ప్రజల ఉపాధి, విద్య అవకాశాల గురించి చర్చించాలన్నారు. హైదరాబాద్ సహా ఇంకా పలు అంశాలపై స్పష్టత రావాలన్నారు. రెచ్చగొట్టే మాటలు ఎవరికీ సరికాదన్నారు. హైదరాబాదు నుండి వెళ్లిపోవాలని ఆదేశించే హక్కు ఎవరికీ లేదన్నారు. దేశంలో ఎక్కడైనా ఎవరైనా జీవించే హక్కు ఉందన్నారు.
విభజనపై కాంగ్రెసు పార్టీది ఒకటే స్టాండ్ అని టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలదే డబుల్ గేమ్ అన్నారు. మిగతా పార్టీల్లా తమకు రంగులు మార్చడం తెలియదన్నారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెడితే పార్టీ విప్ ఉండదని, ఎవరి ప్రాంత ప్రజల మనోభావాలకు అనుకూలంగా వారు ఓటు వేస్తారని చెప్పారు.
చర్చలు జరపాలి: మజీ సిఎం నాదెండ్ల
ఈ స్థాయిలో సమైక్య ఉద్యమం వస్తుందని ఎవరూ అనుకోలేదని మాజీ సిఎం నాదెండ్ల అన్నారు. ప్రజల అభిప్రాయాలు తెలియజేయడంలో పార్టీలు విఫలమయ్యాయన్నారు. విభజనపై అధిష్టానం పునరాలోచించాలని కోరారు. ఇరు ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాలతో చర్చలు జరపాలన్నారు.
ఎపిఎన్జీవో డెడ్ లైన్
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఈ నెల 12వ తేదిలోగా రాజీనామా చేయాలని ఎపిఎన్జీవోలు డెడ్ లైన్ విధించారు. ఆ లోగా రాజీనామా చేయకుంటే నిరవధిక సమ్మె యోచన చేస్తున్నారు.