డిగ్గీతో టిఆర్ఎస్ నేతల భేటీ: విలీనమా, చేరేందుకా?
మాజీ మంత్రి, తెరాస పొలిట్బ్యూరో సభ్యుడు చంద్రశేఖర్, విజయ రామారావు, చందూలాల్లు డిగ్గీని కలిసిన వారిలో ఉన్నారు. దీంతో వారు కాంగ్రెసు పార్టీలో చేరేందుకే కలిశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తెలంగాణకు అనుకూలంగా యూపిఏ, సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్నందున కృతజ్ఞతలు చెప్పేందుకే కలిశామని వారు చెబుతున్నారు.
వీరు డిగ్గీని కలవడంతో రెండు రకాల చర్చలు సాగుతున్నాయి. తెలంగాణపై పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాక తాము విలీనంపై ఆలోచిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు. అంతకుముందు కాంగ్రెసు పెద్దలు మాట్లాడుతూ... తాము తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించినందున విలీనంపై తెరాస స్పందన కోసం చూస్తున్నామని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో తెరాస నేతలు కాంగ్రెసులో చేరేందుకు కాకపోయినా విలీనంపై చర్చించేందుకు కలిసి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. మెదక్ ఎంపి విజయశాంతి ఇప్పటికే కాంగ్రెసు వైపుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరికొందరు తెరాస నేతలు కాంగ్రెసులోకి వచ్చేందుకు క్యూలో ఉన్నారని టియుఎఫ్ నేత దిలీప్ కుమార్ చెప్పారు. దీంతో ఆ కోణంలోను చర్చ సాగుతోంది.
మరోవైపు తాను కాంగ్రెసు పార్టీలో చేరుతాననే ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కొట్టి పారేశారు. తాను తెరాసను వీడుతానని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన మీడియాకు తెలిపారు.