నాకు భర్త కావాలి: 'టెక్కీ' ఇంటి ఎదుట భార్య నిరసన, ఎందుకంటే?
తన భర్త తనకు కావాలి. తనకు తన భర్త ఇంట్లో ఆశ్రయం కల్పించాలంటూ ఓ వివాహిత కుటుంబసభ్యులతో కలిసి అత్తింటి ఎదుట బుదవారం నాడు ఆందోళనకు దిగింది.ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకొంది.
ప్రొద్దుటూరు: తన భర్త తనకు కావాలి. తనకు తన భర్త ఇంట్లో ఆశ్రయం కల్పించాలంటూ ఓ వివాహిత కుటుంబసభ్యులతో కలిసి అత్తింటి ఎదుట బుదవారం నాడు ఆందోళనకు దిగింది.ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకొంది.
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని మాలెపాడు కు చెందిన గుండ్లదుర్తి రాజేంద్రప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరులోని లింగారెడ్డినగర్ లోని కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురుకు 2015 లో బాలాజీనగర్ -1 లో నివాసం ఉంటున్న చిలకల గురు ప్రతాప్ రెడ్డితో సుమలత వివాహం జరిగింది.
అతను హైద్రాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. వివాహసమయంలో తల్లిదండ్రులు కట్నకానుకుల కింద 80 తులాల బంగారాన్ని ఇచ్చారు. పెళ్ళైన నాలుగురోజులకే ఆమె అత్తింటికి వెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత గురు ప్రతాప్ హైద్రాబాద్ కు మకాం మార్చాడు.
ఐదెకరాల పొలం రాసిస్తేనే ఇక్కడ ఉండు, లేకుంటే మీ పుట్టింటికి వెళ్ళాలని భర్త, అత్త ,మామలు చెప్పారు. ఈ క్రమంలోనే తన చేతులు కట్టేసి తాళి తెంచేసి భర్త చిత్రహింసలకు గురిచేశాడని బాధితులు ఆరోపించింది.
ఈ సంఘటనపై హైద్రాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో భర్తపై 498 ఏ సెక్షన్ కింద కేసును నమోదు చేసినట్టు బాధితురాలు చెప్పారు. భర్తతో పాటు అత్త, మామ, ఆడపడుచులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, హైద్రాబాద్ లోని మరో మహిళతో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని సుమలత ఆరోపిస్తోంది. అయితే ప్రతాప్ రెడ్డి రూ.15 లక్షలు నగదు ఇస్తే విడాకులు ఇచ్చేందుకు గాను పెద్దలు పంచాయితీ తీర్పు చెప్పారు.
అయితే ఇరువర్గాల ఒప్పందం ప్రకారంగా ఈ డబ్బును సుమలత కుటుంబానికి ఇవ్వలేదు. అయితే రూ.4 లక్షలు మాత్రమే ఇస్తామని ఆమె అత్త, మామలు చెప్పి పంపించారు.
డబ్బు వద్దని తనకు భర్త కావాలని సుమలత చెబుతోంది. తన భర్త ఇంట్లో తనకు ఆశ్రయం కల్పించాలని బాధితురాలు కోరుతోంది.ఈ మేరకు ప్రొద్దుటూరులోని తన భర్త ఇంటి ఎదుట ఆమె ఆందోళనకు దిగింది.
సుమలత ఆందోళనకు మహిళా సంఘాలు , ప్రజా సంఘాలు మద్దతును ప్రకటించాయి.అయితే ఇరువర్గాలను స్టేషన్ కు రావాలని పోలీసులు కోరారు. విచారించి న్యాయం చేస్తామని పోలీసులు చెప్పారు.దీంతో సుమలత ఆందోళన విరమించింది.