ప్రేమోన్మాది ఘాతుకం: యువతి గొంతుకోసి హత్య, చితకబాదిన గ్రామస్తులు
కడప: జిల్లాలోని బద్వేలు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువతి గొంతుకోసి హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలచెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మకు శిరీష అనే 18ఏళ్ల కూతురు ఉంది. ఆమె బద్వేల్ వీరారెడ్డి కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. కాగా, గత కొంత కాలంగా చరణ్ అనే యువకుడు శిరీషను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు.
కాగా, ప్రస్తుతం కాలేజీ సెలవులు కావడంతో శిరీష ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో చరణ్ శుక్రవారం చింతల చెరువు గ్రామంలోకి వెళ్లి శిరీషను బలవంతం చేశాడు. ప్రతిఘటించడంతో అక్కడేవున్న కత్తితో శిరీష గొంతుకోశాడు చరణ్. దీంతో అక్కడే కుప్పకూలిపోయింది శిరీష.
తీవ్రరక్తస్రావం కావడంతో ఆమె ప్రాణాలు వదిలింది. గమనించిన స్థానికులు చరణ్ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని చరణ్ను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మట్టిగడ్డ కూలిపడి వ్యక్తి మృతి
కర్నూలు జిల్లాలోని కంబాలనదిన్నె గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆరు అడుగుల లోతులో ఉన్న ఇసుకను తీస్తుండగా పైనవున్న మట్టిగడ్డకూలిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కంబాలదిన్నె గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే యువకుడు ఎద్దులబండి తీసుకుని ఇసుక తెచ్చేందుకు సమీపంలో నది వద్దకు వెళ్లాడు. ఇసుక ఆరు అడుగుల గోతిలో ఉండటంతో దాన్ని తీసిబయటకు పోస్తుండగా.. పైనవున్న మట్టిదిబ్బ విరిగి ఆ గోతిలో ఉన్న లక్ష్మీనారాయణపై పడింది. గమనించిన స్థానికులు మట్టిని తొలగించి అతడ్ని కాపాడే ప్రయత్నం చేశారు. బయటికి వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే లక్ష్మీనారాయణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. యువకుడి మృతితో అతడి కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.