బ్యాంకుల్లో వేలకోట్లు, 'అమరావతి' కోసం నిరీక్షణ: పెట్టుబడి ఎక్కడ?
విజయవాడ: నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి తెరపైకి వచ్చిన నేపథ్యంలో చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుంది. అయితే, కొద్ది రోజులుగా రియల్ వ్యాపారం తగ్గుముఖం పట్టిందని అంటున్నారు. అందుకు కారణం... ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలియకేననే వాదనలు వినిపిస్తున్నాయి.
అమరావతి రాజధాని నేపథ్యంలో కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వారు కూడా పెట్టుబడులు పెట్టారు. అలాగే, తమ భూములను కోట్లాది రూపాయలకు స్థానిక రైతులు రాజధాని కోసం అమ్ముకున్నారు. వారు కూడా తమ డబ్బును దాచుకుంటున్నారు.
పెట్టుబడి ఎందులో పెట్టాలో తెలియక మనీ సర్క్యులేషన్ దాదాపు ఆగిపోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయట. భూములు అమ్ముకున్న రైతులకు కోట్లాది రూపాయలు వచ్చాయి.
చాలామంది రైతులు తాము అమ్మిన భూముల ద్వారా వచ్చిన డబ్బును బ్యాంకుల్లో దాచుకున్నారు. అంత పెద్ద మొత్తాలు ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలో అప్పుడే తెలియక ఆగిపోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మనీ సర్క్యులేషన్ ఆగిపోయిందంటున్నారు.
అమరావతిని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోను భూమి విలువకు రెక్కలు వచ్చింది. అమరావతి 'మాస్టర్ ప్లాన్' ముందుకు కదిలినప్పుడు మనీ సర్క్యులేషన్ తిరిగి ప్రారంభమవుతుందని చాలామంది భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, బిల్డర్స్, ల్యాండ్ డెవలపర్స్ బిజీగా ఉండనున్నారు. సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిపోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగులు కూడా సొంత రాష్ట్రం నుంచి పాలన చేస్తేనే బాగుంటుందని సీఎం చంద్రబాబు కూడా చెబుతున్నారు.
బెజవాడలో నేను, హైదరాబాదులో ఉద్యోగులు ఉంటే పాలన సరిగా ఉండదని చెబుతున్నారు. ఉద్యోగాలను సాధ్యమైనంత త్వరగా రాజధాని ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి బిల్డర్స్, ల్యాండ్ డెవలపర్స్కు సంతోషాన్ని ఇచ్చే విషయాలనే చెప్పవచ్చు.
మరోవైపు, రాజధాని ప్రాంతంలో దాదాపు 40 మెగా ప్రాజెక్టులకు సీఆర్డీఏ పచ్చజెండా ఉపాల్సి ఉంది. ఈవి 15 నుంచి ఇరవై మూడంతస్తుల భవంతులు నిర్మించనున్నాయి. జయభేరీ, మహాలక్ష్మి, రామకృష్ణ, మంజీర వంటి నిర్మాణ సంస్థలు ఇప్పటికే కొన్ని భూమిపూజ చేయగా, మరిన్ని త్వరలో ప్రారంభం కానున్నాయి.