జగన్ పలుచన అయ్యారు: వీడియో చూసిన బాబు, నా వద్దకు రావద్దని హెచ్చరిక
మూడు రోజుల క్రితం నందిగామ ఆసుపత్రిలో వైసిపి అధినేత వైయస్ జగన్ వ్యవహరించిన తీరు పట్ల గురువారం నాడు ఏపీ కేబినెట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేత తీరును ఖండిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసిం
విజయవాడ: మూడు రోజుల క్రితం నందిగామ ఆసుపత్రిలో వైసిపి అధినేత వైయస్ జగన్ వ్యవహరించిన తీరు పట్ల గురువారం నాడు ఏపీ కేబినెట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేత తీరును ఖండిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది.
ప్రతిపక్ష నేత వ్యవహార శైలి పైన కేబినెట్లో చర్చ జరిగింది. కలెక్టర్ బాబు పట్ల జగన్ ప్రవర్తించిన తీరు, ఆయన వాడిన పదజాలం అభ్యంతరంగా ఉందని కేబినెట్ భావించింది. విధుల్లో ఉన్న అధికారుల పట్ల ప్రజాప్రతినిధులు మర్యాదగా ప్రవర్తించే సంప్రదాయాన్ని జగన్ విస్మరించారని కేబినెట్ తీర్మానంలో పేర్కొంది.
కలెక్టర్కు జగన్ బెదిరింపు: ఇదీ చంద్రబాబు.. 'సాక్షి' కౌంటర్
గురువారం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రానున్న శాసన సభ సమావేశాల్లో అనుసరించాల్సిన తీరు, వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్, అలాగే జగన్ ప్రవర్తన తదితర అంశాలు చర్చకు వచ్చాయి.
జగన్ తీరుకు సంబంధించిన వీడియోలు
కలెక్టర్తో జగన్ వ్యహరించిన తీరుకి సంబంధించిన వీడియోలను కేబినెట్ సమావేశంలో ప్రదర్శించారు. 'నిన్ను సెంట్రల్ జైలుకి తీసుకుపోయే కార్యక్రమం చేస్తాన'ని కలెక్టర్తో జగన్ అన్నట్టుగా కొందరు మంత్రులు పేర్కొన్నారు. కలెక్టర్ను తనతో పాటు సెంట్రల్ జైలుకి తీసుకెళతానని అన్నట్టుగా ఉందని ఒక మంత్రి, జగన్ తానే సెంట్రల్ జైలుకి వెళతాను అన్నట్టుగా ఉందని మరో మంత్రి అన్నారు.
నిస్పహృతో మాట్లాడుతున్న జగన్
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కల్పించుకున్నారు. జగన్ నిస్పృహలో ఉన్నారని, అందుకే అర్ధంపర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఓ సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తాను, కేఈ కృష్ణమూర్తి, అశోక్ గజపతి రాజులం 1978 నుంచి రాజకీయాల్లో ఉన్ామని, యనమల రామకృష్ణుడు 1983 నుంచి ఉన్నారని, కానీ తామంతా జగన్ లాంటి ప్రతిపక్ష నేతను చూడలేదన్నారు.
అంతకుముందు వైయస్ ఓకే కానీ..
వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా మాట్లాడేవారే తప్ప, అంతకు ముందు కొంత పద్ధతిగానే ఉండేవారని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. ఒక మంత్రివర్గ సమావేశంలో విపక్ష నేతకు సంబంధించిన వీడియో చిత్రాలను చూసి, చర్చించడం ఇదే మొదటిసారి అంటున్నారు.
అందుకే జగన్ పలుచన అవుతున్నారు
ఇష్టానుసారం మాట్లాడటం వల్లే రెండేళ్లుగా వైసిపి నేతలు, జగన్ ప్రజల్లో పలచనయ్యారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మంత్రులు తమ శాఖలకు సంబంధించిన అంశాలపై పూర్తి స్పష్టతతో ఉండాలని, సీనియర్ సభ్యులు ఏ అంశంపైన ఐనా దీటుగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
సాక్షిని బట్టి.. వీటిని లేవనెత్తవచ్చు
ప్రతిరోజు శాసనసభ సమావేశాలు ముగిశాక వ్యూహ కమిటీ కూర్చుని చర్చించాలని, తాను సైతం రోజూ గంట సమయం కేటాయిస్తానని చంద్రబాబు చెప్పారు. సమావేశాలు ముగిశాక మర్నాడు జరిగే సభకు పక్కాగా సిద్ధం కావాలన్నారు. వైసిపి ఇటీవల మాట్లాడుతున్న అంశాలు, సాక్షి పత్రికలో వస్తున్న కథనాల్ని బట్టి చూస్తుంటే ఆ పార్టీ లేవనెత్తే అంశాలు 28 వరకు ఉంటాయని వ్యూహ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. ప్రధానంగా నిరుద్యోగ భృతి, ప్రత్యేక హోదా, శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్ వంటి అంశాల్ని వైసీపీ ప్రస్తావించవచ్చునని అభిప్రాయపడ్డారు.
అలాగైతే నా నుంచి ఏం ఆశించవద్దు
మరోవైపు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి తీరాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థుల్ని గెలిపించలేకపోతే ఊరుకునేది లేదని, ఆ తర్వాత మీరు నా దగ్గరకు రావలసిన, నా నుంచి ఏమీ ఆశించాల్సిన అవసరం లేదని, మీకు ఎలాంటి సహకారం లభించదని ముక్కు సూటిగా చెప్పారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా మంత్రి కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్లకు ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నారు. కర్నూలు-కడప-అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి కేజే రెడ్డిని వారే తీసుకొచ్చారని, ఆయనను అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్నికల్లో సమర్థంగా ప్రచారం చేయడం లేదన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్టు సమాచారం.
అసెంబ్లీ 14 రోజులే..
శాసనభ బడ్జెట్ సమావేశాలు 14 రోజులే జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. టిడిపి వ్యూహ కమిటీ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు జరపనున్నారు. ఈ నెల 6న సమావేశాలు మొదలవుతున్నాయి. 6, 7 తేదీల్లో సమావేశాలు జరిగిన తర్వాత వరుసగా ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. మళ్లీ 13న బడ్జెట్ ప్రవేశపెడతారు. మరోవైపు, కేబినెట్ సమావేశంలో కొత్త సీఎస్ అజేయకల్లంకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఎస్.పి.టక్కర్ సేవల్ని మంత్రివర్గం కొనియాడింది.
మనం సంయమనం కోల్పోవద్దు
ప్రతిపక్షం నిస్పృహలో ఉందని, మనం చేస్తున్న కార్యక్రమాలు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేకపోతోందని, విపక్ష సభ్యులు ఇష్టానుసారం మాట్లాడారని మనం సంయమనం కోల్పోవద్దని, మన ప్రతి మాటా ప్రజలకు జవాబు చెప్పేలా ఉండాలే తప్ప, విపక్షం గురించి ఆలోచించవద్దని, వాళ్లు రెచ్చగొట్టారని మనం ఉచ్చులో చిక్కుకోవద్దని, అలాగని వాళ్లు ఇష్టం వస్తున్నట్టు ప్రవర్తిస్తుంటే, మనం నియంత్రించలేకపోతున్నామన్న భావనా ప్రజల్లో రావడం మంచిది కాదని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.