అడిగితే రాయలసీమ చిచ్చుపెడతారా: బిజెపిపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
అమరావతి:ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హమీలను, రాజ్యసభలో ఇచ్చిన హమీలను అమలుచేయాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ శాసనమండలి శుక్రవారం నాడు తీర్మానం చేసింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ తీర్మానాన్ని శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఏపీ శాసనసమండలిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు సుధీర్ఘంగా ప్రసంగించారు.ఏపీ రాష్ట్ర విభజనతో పాటు ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు, ఏపీ రాష్ట్రానికి బిజెపి ఇచ్చిన హమీలపై బాబు సుధీర్ఘంగా మాట్లాడారు.
బిజెపి, వైసీపీ, పవన్ కళ్యాణ్ తనపై చేసిన విమర్శలను బాబు ప్రస్తావించారు. ఈ విమర్శలకు బాబు ధీటుగా కౌంటరిచ్చారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఏపీ విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ శాసనమండలి శుక్రవారం నాడు తీర్మానం చేసింది.ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు తెలుగు జాతి విశ్రమించబోదని చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో విపక్షంగా ఉన్న బిజెపి నేతలు ఏపీకి అన్ని రకాలుగా సహయం చేస్తామని చెప్పిన మాటలను బాబు ప్రస్తావించారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సభలో మోడీ చేసిన ప్రసంగాన్ని, ఏపీ రాష్ట్రంలోని పలు చోట్ల మోడీ, బిజెపి నేతల ప్రసంగాలను బాబు ప్రస్తావించారు.
ప్రశ్నిస్తే ఎదురుదాడులు చేస్తున్నారు
రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయాలని కేంద్రాన్ని ప్రశ్నిస్తే తనపై ఎదురుదాడికి దిగుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. నాలుగేళ్ళుగా ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఏమివ్వలేదన్నారు. ప్రత్యేకహోదాతో కూడిన ప్యాకేజీని ఇస్తామన్నారని బాబు చెప్పారు. కానీ, అమలు చేయలేదన్నారు. చిట్టచివరి బడ్జెట్లో కూడ ఏపీకి న్యాయం చేయలేదన్నారు ఈ విషయమై ప్రశ్నిస్తే తనపై ఎదురుదాడికి దిగుతున్నారని చెప్పారు. ఎవరెవరితోనే తనపై విమర్శలు చేయిస్తున్నారని బాబు చెప్పారు.
చిచ్చు పెట్టేందుకు రాయలసీమ డిక్లరేషన్
రాయలసీమ డిక్లరేషన్ ను తెచ్చి రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు బిజెపి ప్రయత్నాలు చేసిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తాను రాయలసీమ వాడినేని బాబు చెప్పారు. ఏ ఉద్దేశ్యంతో బిజెపి రాయలసీమ డిక్లరేషన్ ముందుకు తెచ్చిందో చెప్పాలని బాబు ప్రశ్నించారు. రాయలసీమపై ప్రేమ ఉంటే హైకోర్టు భెంచ్ కర్నూల్లో ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేయించారు. దేశానికి రెండో రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయించాలని బిజెపి నేతలకు బాబు సూచించారు.
పోలవరం పై తప్పుడు ప్రచారం
పోలవరం ప్రాజెక్టు విషయమై కూడ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.పోలవరం ప్రాజెక్టు పూర్తైతే ఏపీలో కరువే ఉండదని చెప్పారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగా పనులు జరిగితే 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరిచ్చేవాళ్లమన్నారు. కానీ, 2019 నాటికి పోలవరం ద్వారా నీటిని ఇవ్వనున్నట్టు బాబు చెప్పారు. పోలవరంపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని బాబు చెప్పారు. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలకు బాబు సమాధానమిచ్చారు. పవన్ కళ్యాణ్కు పోలవరంపై అవగాహన లేకుండా మాట్లాడారని బాబు అభిప్రాయపడ్డారు.
అమరావతిని నిర్మిస్తాం
ఇతర రాష్ట్రాల్లో రాజధానుల నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో నిధులను కేటాయించారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. ఏపీ రాష్ట్రానికి రాజధాని లేదన్నారు. రాజధాని నిర్మాణం శంకుస్థాపన సమయంలో వచ్చిన మోడీ ఇచ్చిన హమీని నిలుపుకోలేదని చంద్రబాబునాయుడు చెప్పారు.తనపై నమ్మకంతోనే రైతులు రాజధాని నిర్మాణం కోసం భూములను ఇచ్చారని చెప్పారు. హైద్రాబాద్, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీని తలదన్నేరీతిలో అమరావతిని నిర్మిస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు.