రోజా దెబ్బకు దిగొచ్చిన బాలయ్య: మహిళలపై వ్యాఖ్యలకు క్షమాపణ
హైదరాబాద్: హీరో నారా రోహిత్ సావిత్రి సినిమా వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం తారాస్థాయికి చేరడంతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణ దిగొచ్చారు. ఆయనపై చెలరేగుతున్న దుమారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా వ్యాఖ్యలతో తారాస్థాయికి చేరుకుంది. ఆయన వ్యాఖ్యలపై న్యాయవాదులు పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు.
వివాదానికి అంతం పలకడానికి ఆయన తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇతరులను గౌరవించడం, మహిళలను తోడబుట్టినవారిగా చూడడం తమ ఇంటి సంప్రదాయమని అన్నారు. తన మాటలకు ఎవరైనా నొచ్చుకుని ఉంటే మన్నించాలని ఆయన అన్నారు.
ఎవరిని నొపించడం కోసం ఆ విధంగా వ్యాఖ్యలు చేయలేదని, సినిమాకు సంబంధించి కథాపరంగా సన్నివేశాల గురించి చెబుతూ చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని బాలయ్య వివరణ ఇచ్చారు. సినిమా వేడుకలో సరదాగా చేసిన వ్యాఖ్యలను వేరే ఉద్దేశంతో చూడవద్దని బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.
మహిళలను తోబుట్టువులుగా చూడడం తనకు తన తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన గుణమని, మహిళల పట్ల తనకు ఎప్పుడూ అపారమైన గౌరవం ఉంటుందని ఆయన చెప్పారు. మంగళవారం (రేపు) మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ర్టాల్లో ఉన్నవారు, దేశ విదేశాల్లో ఉన్న సోదరీమణులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని బాలయ్య కోరారు.