ఆ ఊరినే ఆక్రమించేశారు;731 ఎకరాలు స్వాహా:విచారణలో నిగ్గు తేలిన నిజాలు
కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని జౌకులపల్లి దాదాపు ఊరు ఊరంతా కబ్జా అయింది. ఈ గ్రామం పరిధిలోని సుమారు 760 ఎకరాల అటవీభూమి అక్రమంగా స్వాహారాయుళ్ల పరం అయింది. ఇందుకోసం రికార్డులను తారుమారు చేయడం, తప్పుడు పత్రాలను సృష్టించడం...ఇలా సమస్త మాయాజాలాలు చేశారు. ఇలా నిర్భీతిగా వందలాది ఎకరాలు భూమిని స్వాహా చేసేశారు.
దీనిపై మీడియాలో ప్రత్యేక కథనాలు రావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ జౌకులపల్లి ఆక్రమణలపై విచారణకు ఆదేశించారు. ఈ విచారణ జరగకుండా, ఆ తరువాత నివేదిక బైటకు రాకుండా అక్రమార్కులు విశ్వప్రయత్నం చేశారు. అయితే జిల్లా కలెక్టర్ బాబూరావు ప్రత్యేక శ్రద్దతో విచారణ పూర్తయి నివేదిక సిద్దం అయింది. ఆ నివేదిక ప్రకారం 760 ఎకరాలకు పైగానే భూములు కబ్జాకు గురైనట్లు నిగ్గుతేలింది.
జౌకులపల్లి భూములు...వివరాలు...
జౌకులపల్లి లో సుమారు 760 ఎకరాలు దురాక్రమణ జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ఇక్కడ ఎటుచూసినా ఆక్రమణలే ఆక్రమణలు అన్నట్లుగా పరిస్థితి కనిపించింది. ఈ రెవెన్యూ గ్రామంలో మొత్తం 4,618 ఎకరాల భూమి ఉంది. ఇందులో పట్టా భూమి 482.45 ఎకరాలు కాగా డీకేటీ సుమారు 450 ఎకరాలు, యుఏడబ్ల్యూ విభాగంలో 3,865.32 ఎకరాల భూమి ఉంది. అయితే కడప- చెన్నై స్టేట్ హైవే విస్తరణ కోసమని 2005లో అటవీ భూమిని సేకరించారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా రెవిన్యూ శాఖ పర్యవేక్షణలో ఉన్న 266 సర్వే నంబరులో 291 ఎకరాలను 2005 అక్టోబరు 23న అటవీ శాఖకు కేటాయించారు. అలాగే విశాఖపట్నం బాక్సైట్ గనులతో భూములు నష్టపోయిన వారికి 2008 సెప్టెంబరు 6న మరో 309 ఎకరాలను భూమిని ఇక్కడే ఇచ్చారు.
సమస్యకు అంకురార్పణ...భూకబ్జాదారులకు వరం...
అయితే ఈ కేటాయింపుల్లోనే సమస్య ఉంది. ఈ కేటాయింపుల సమయంలో సుమారు 600 ఎకరాలకు సంబంధించి అప్పట్లో సరైన హద్దులను ఏర్పాటు చెయ్యలేదు. దీన్నే స్వాహారాయుళ్లు అవకాశంగా తీసుకొని రెచ్చిపోయారు. ఈ భూముల గురించి తెలుసుకొని తమ పెట్టుబడి,పలుకుబడి ప్రయోగించి దొరికినమేరా ఆక్రమించేశారు. అంతటితో ఆగకుండా అక్రమంగా పట్టాలను సృష్టించి నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను తయారు చేయించారు. వీటి ఆధారంగా బ్యాంకు రుణాలు పొందారు...మరికొందరు ఏకంగా సేద్యం మొదలుపెట్టారు. వీటికోసం బోర్లు వేశారు...విద్యుత్తు కనెక్షన్లు కూడా పొందారంటే ఈ కబ్జారాయుళ్ల తెగువ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.
కలెక్టర్ విచారణ...కబ్జాలు నిజమేనని నిర్థారణ...
ఈ భూముల ఆక్రమణలపై ఈనాడు పత్రిక ప్రత్యేక కథనాలు వెలువరించడంతో కడప జిల్లా కలెక్టర్ బాబూరావు విచారణకు ఆదేశించారు. అయితే ఈ విచారణ జరిగితే అసలు నిజాలు బైటకు వస్తాయని, తమ కబ్జాల పర్వం బైటపడుతుందని, స్వాహా చేసిన భూములు వదులుకోవాల్సి ఉంటుందని అక్రమార్కులు విచారణ జరగకుండా చూడాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఎంత డబ్బయినా కుమ్మరించేందుకు సిద్దపడ్డారు. బెదిరింపులకు దిగారు. అయినా కలెక్టర్ దిశానిర్దేశంతో అధికారులు ముందుకువెళ్లి ఈ ఆక్రమణల పర్వాన్ని నిగ్గు తేల్చారు. ఈ ఆక్రమణలపై విచారణాధికారులు కలెక్టర్కు సమర్పించిన నివేదిక ప్రకారం...మొత్తం 231 కేసుల్లో అడ్డదారిలో భూకబ్జాలకు దిగినట్లు రాతపూర్వకంగా నిర్ధారించడం జరిగింది. ఈ ఆక్రమణల్లో మొత్తం 760.19 ఎకరాలు పక్కదారి పట్టినట్లు స్పష్టం అయింది. దీనికోసం వివిధ శాఖల అధికారులు కుమ్మక్కయి అక్రమాలకు సహకారం అందించినట్లు వెల్లడయింది. అంతేకాదు రెవెన్యూ కార్యాలయంలో ఏకంగా రికార్డులనే టాంపరింగ్ చేసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించడం జరిగింది.
ఎవర్నీ వదలం...వేటు తప్పదు...భూములు తిరిగి స్వాధీనం...
మొత్తం మీద ఇక్కడ అడుగడుగునా అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయింది. రెవెన్యూలో ఏ విధమైన సహకారంతో ఏ తీరులో అవకతవకలు జరిగాయో కూడా సమగ్ర నివేదికను కలెక్టర్కు చేర్చారు. ప్రస్తుతం ఈ నివేదిక ఇటు రెవెన్యూ, అటు రాజకీయవర్గాల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. దీనిని బట్టి ఎప్పుడు ఎవరిపై ఎలాంటి చర్యలుంటాయనే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని జిల్లా ఉన్నతాధికారులు ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై రాజంపేట ఆర్డీవో వీరబ్రహ్మం మాట్లాడుతూ జౌకులపల్లిలో "భూ ఆక్రమణలు జరిగినట్లు గుర్తించాం...ఇందులో ఎంతటి వారున్నా వదిలిపెట్టమని చెప్పారు. కడప డిఎఫ్వో ఆర్డీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ అటవీ భూమిలో ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించామని, రిజర్వు ఫారెస్టులో ఉంటే కచ్చితంగా చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటామని, ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తేలేదన్నారు.