టిడిపి దూరమైతే..: బాబు హెచ్చరికతో మోడీ అప్రమత్తం, దిద్దుబాట!
విజయవాడ/న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా అంశంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్రం పైన, ప్రధాని మోడీ పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండు రోజులుగా ఆయన కేంద్రంపై తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఒకింత దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందనే వార్తలొచ్చాయి.
హోదా అంశం టిడిపి - బిజెపి మధ్య దూరాన్ని పెంచుతోన్న విషయం తెలిసిందే. హోదా పై కేంద్రం హామీ ఇవ్వకపోవడంతో టిడిపి నేతలు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు కూడా శుక్రవారం, ఆదివారం కేంద్రంపై ధ్వజమెత్తారు.
హోదాపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థికమంత్రి జైట్లీ ఇచ్చిన సమాధానం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. బీజేపీతో అమీతుమీకి టిడిపి సిద్ధపడుతోందా అనే చర్చ సాగుతోంది. సీఎం చంద్రబాబు శుక్రవారం చేసిన వ్యాఖ్యలు టీడీపీ ధోరణికి అద్దం పడుతున్నాయంటున్నారు.
జైట్లీ వ్యాఖ్యలతో బాధపడ్డ బాబు, మోడీకి జపాన్ తరహా నిరసన
చంద్రబాబు వ్యాఖ్యలు బీజేపీ అధిష్ఠానానికి మింగుడు పడటం లేదని అంటున్నారు. ఇప్పటికే శివసేనతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న బీజేపీకి టిడిపి కూడా దూరమైతే భవిష్యత్తులో జాతీయస్థాయిలో ప్రభావం పడుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న టిడిపితో తెగదెంపులు చేసుకొంటే వచ్చే ఏడాది యూపీతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో దాని ప్రభావం పడే అవకాశముందని భయపడుతున్న బీజేపీ చంద్రబాబును శాంతింపజేసే ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నారట.
బీజేపీ-టీడీపీ స్నేహం కొనసాగదు, అందుకే మోడీ శత్రువు బాబు: జేసీ సంచలనం
చంద్రబాబు ఆగ్రహాన్ని రాష్ట్ర బీజేపీ నేతలతోపాటు కేంద్రంలో ఉన్న సీనియర్లు కొంతమంది ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దిద్దుబాటుకు సిద్ధమైట్లుగా తెలుస్తోంది. మోడీ సూచనల మేరకే టీడీపీపై ఎలాంటి విమర్శలు చేయవద్దని అమిత్ షా పార్టీ నేతలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
లోకసభలో పదహారు మంది ఎంపీలు, రాజ్యసభలో ఆరుగురు సభ్యులతో ఎన్డీయేలో టీడీపీ రెండో అతి పెద్ద పార్టీగా ఉంది.
అలాంటి పార్టీ ఎన్డీయే నుంచి నిష్క్రమిస్తే మిగిలిన భాగస్వామ్య పక్షాలకు అది తప్పుడు సంకేతాలు పంపుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా చంద్రబాబును ఢిల్లీ పిలిపించి మాట్లాడాలని మోడీ భావిస్తున్నారని అంటున్నారు. కాగా, హోదా అంశంపై ఏపీ ప్రజలకు బీజేపీ మరింత వివరణ ఇవ్వాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.