టిడిపి నేతలను తరిమికొడ్తారు: ప్రత్యేక హోదాపై బొత్స హెచ్చరిక
హైదరాబాద్: ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ అంటే ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులను తరిమికొడ్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని మర్చిపోయి, ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ఇస్తుందని, దీని వల్ల హోదా కంటే ఎక్కువ లాభాలు ఉంటాయని టిడిపి మంత్రులు, ఎంపీలు చేసే ప్రకటనలను ప్రజలు నమ్మరని ఆయన అన్నారు.
ప్రత్యేక ప్యాకేజీ అంటే టిడిపి మంత్రులు, నేతలను ప్రజలు తరిమిగొడుతారని, ఆంధ్ర ప్రజల సహనాన్ని పరీక్షించే పనులు చేయవద్దని ఆయన అన్నారు. ఈ నెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా సాధనకు తలపెట్టిన బంద్ను 29వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. 28వ తేదీన వరలక్ష్మీ వ్రతం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలో తమ పార్టీ నిర్వహించిన ధర్నా, సిపిఐ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపు విజయవంతం కావడంతో టిడిపి నేతలు బెంబేలెత్తుతున్నారన్నారు. టిడిపి కేంద్రమంత్రులు ఢిల్లీలో ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని హడావుడిగా కలుసుకుని ప్రత్యేక ప్యాకేజీ వెంటనే వస్తుందని వివరాలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసే అధికారాన్ని కేంద్రం కలిగి ఉండగా, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరన్నారు.
ప్రత్యేక ప్యాకేజీల వల్ల టిడిపి నేతలు బాగుపడుతారని, ప్రజలకు మిగిలిదే జీరో అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని, రాజీపడే ప్రసక్తిలేదని బొత్స చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీపైన ఆశించిన స్ధాయిలో వత్తిడి తేవడం లేదని, తన స్వార్ధ ప్రయోజనాల కోసం, ఓటుకునోటు స్కాం నుంచి బయటపడేందుకు రాజీపడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో తమ పార్టీ ప్రత్యేక హోదా సాధనకు దశలవారీగా ఉద్యమం చేపడుతుందన్నారు.