అది నా కష్టం, టి ప్రజలు అనుభవిస్తున్నారు: కేసీఆర్కు బాబు షాక్
సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో తెలంగాణ మొదటిస్థానంలో ఉందని తెలంగాణలోని అధికార తెరాస పార్టీ నాయకులు చెబుతున్నారు.
అమరావతి/హైదరాబాద్: సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో తెలంగాణ మొదటిస్థానంలో ఉందని తెలంగాణలోని అధికార తెరాస పార్టీ నాయకులు చెబుతున్నారు. దీనికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
నవ నిర్మాణ దీక్ష సందర్భంగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ ముందు ఉండగా, ఏపీ అయిదో స్థానంలో ఉంది. ఈ రోజు (జూన్ 2) తెలంగాణలో అవతరణ వేడుకలు, ఏపీలో నవ నిర్మాణ దీక్షలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ తన ప్రచారంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ముందంజలో ఉన్నామని చెప్పింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎవరి వల్ల!?
తద్వారా ముఖ్యమంత్రి తమ పాలన వల్లే ఇది సాధ్యమయిందని కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే, విజయవాడలో జరిగిన నవ నిర్మాణ దీక్ష సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఓ విధంగా కేసీఆర్కు పరోక్షంగా కౌంటర్.
తెలంగాణను అధిగమిస్తాం
చంద్రబాబు మాట్లాడుతూ... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్రాల్లో ఏపీ కన్నా తెలంగాణ రాష్ట్రం ముందుందని, భవిష్యత్తులో నవ్యాంధ్ర దానిని అధిగమిస్తుందన్నారు.
నా వల్లే.. ఇప్పుడు తెలంగాణవాసులు అనుభవిస్తున్నారు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అవిభాజ్య ఏపీని తొలి స్థానంలో నిలిపేందుకు తానెంతో కృషి చేశానని, ఆ ఫలితాలను ఇప్పుడు తెలంగాణవాసులు అనుభవిస్తుండటం, తనకు ఆనందాన్ని కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు.
ఆ సత్తా మనకు ఉంది
అయితే, నవ్యాంధ్రను ప్రస్తుతమున్న అయిదో ర్యాంకు నుంచి ఫస్ట్ ర్యాంకుకు తేవడమే తన ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. ఆ సత్తా మనకు లేదా? అని చంద్రబాబు అన్నారు.
ఒక్కటొక్కటి సాధిస్తున్నాం
ఆయన ఇంకా మాట్లాడుతూ... రాష్ట్రాన్ని విభజించిన వేళ, చట్టంలో చేర్చిన అంశాలను ఒక్కొక్కటిగా సాధిస్తున్నామని, ఇంకా సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఆర్థిక సంస్కరణల ద్వారా ఆదాయం పెరుగుతుందని, అవినీతి లేని సమాజ స్థాపనే లక్ష్యంగా కృషి చేస్తున్నానని తెలిపారు.