ఏపీ ప్రభుత్వ కార్యాలయ పనివేళల్లో మార్పులు .. రేపటి నుండే అమలు, ఇక నుండి టైమింగ్స్ ఇవే !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కరోనా మహమ్మారి కారణంగా మార్పులు చేసిన ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు పునరుద్ధరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు పునరుద్ధరిస్తున్నట్లు సీఎస్ ఆదిత్యనాథ్ ఈ రోజు వెల్లడించారు. ఇక రేపటి నుంచి ప్రభుత్వం మార్పులు చేసిన పని వేళలు అమల్లోకి వస్తాయంటూ పేర్కొన్నారు.
ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం జిల్లా కార్యాలయాలు, ఇతర ఉప కార్యాలయాలు ఉదయం 10.30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక సచివాలయంతో పాటు, విభాగాధిపతులు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని జగన్ సర్కార్ ఉత్తర్వుల్లో వెల్లడించింది.
జిల్లా కార్యాలయాలకు ఆదివారం, రెండో శనివారం మాత్రమే సెలవు ఉంటుందని స్పష్టం చేసింది. సచివాలయం, కార్పొరేషన్లు, విభాగ అధిపతి లకు సంబంధించిన రాష్ట్ర కార్యాలయాలు మరో ఏడాది పాటు వారానికి ఐదు రోజులే పనిచేస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్ గురించి సీఎం జగన్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ప్రభుత్వ కార్యాలయ పనివేళలో పై మార్పులు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.