వణికిస్తున్న పిడుగులు: ఒక్కరోజే 40వేల పైచిలుకు, ప్రకృతి పగబట్టిందా?
విజయవాడ: రాష్ట్రంలో వాతావరణం ఎప్పుడెలా మారుతుందో చెప్పలేని పరిస్థితి. ఎండాకాలంలో ఉరుములు, పిడుగులతో ప్రకృతి సృష్టిస్తున్న బీభత్సం జనజీవనాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో వేల సంఖ్యలో 'పిడుగులు' పడుతుండటం ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది. మంగళవారం ఒక్కరోజే దాదాపు 41,025 పిడుగులు పడటం గమనార్హం. దీంతో పిడుగుపాటుకు గురై వేర్వేరు చోట్ల 14 మంది మృత్యువాతపడ్డారు. అలాగే చాలాచోట్ల మామిడి, అరటి పంటలు కూడా పిడుగుపాటు కారణంగా ధ్వంసమయ్యాయి.
ఈ సీజన్ లో మొత్తం లక్ష పైనే..:
ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి మే 1 వరకూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏకంగా 1,40,982 పిడుగులు పడ్డట్టు అంచనా. ఎండాకాలం మొదలైనప్పటి నుంచి ప్రతీరోజూ రాష్ట్రంలో ఎక్కడో చోట పిడుగులు పడుతూనే ఉన్నాయి. పిడుగుపాటుకు గురై మొత్తం 39 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఇది అధికారికి లెక్క మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చు అంటున్నారు.
భూతాపం వల్లే:
భూతాపం పెరగడమే పిడుగులకు కారణమని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్-జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకు 40-48డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. ఇది భూతాపానికి కారణమవుతుంది. అదే సమయంలో సముద్రం నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం పెరిగి ఆకాశంలో దట్టమైన నల్లని క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడుతాయి. వీటి కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది.
మెరుపులు రెండు రకాలు:
వాస్తవానికి మెరుపులు రెండు రకాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆకాశంలో ఒక మేఘం మరో మేఘాన్ని ఢీకొనడం వల్ల విద్యుదాఘాతం ఏర్పడి మెరుపు పుడుతుందని, అలాగే మేఘంలోని అణువులు ఢీకొట్టుకోవడం వల్ల కూడా విద్యుదాఘాతం ఏర్పడి మెరుపు పుడుతుందని.. దీన్నే పిడుగు అంటామని చెబుతున్నారు. ఆకాశం నుంచి పిడుగుపడేటప్పుడు స్పష్టమైన మెరుపు తీగ కనిపిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజీ రమేష్ తెలిపారు.
అరగంట ముందే గుర్తించవచ్చు..:
భూతాపం పెరగడం వల్లే రాష్ట్రంలో పిడుగులు పెరిగాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజీ రమేష్ తెలిపారు. గతంలో పిడుగుపాటును ముందుగా గుర్తించే పరిజ్ఞానం లేదని, ప్రస్తుతం ఏ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందనే విషయాన్ని అరగంట ముందే కనుగొనే పరిజ్ఞానం అందుబాటులో ఉందని అన్నారు. వాస్తవానికి మెరుపులతో కూడిన వర్షం(థండర్ స్ట్రోమ్) వల్ల భూతాపం తగ్గుతుందని, వీటిని ప్రకృతి ప్రసాదించిన వరాలుగా చెప్పవచ్చని ఆయన అన్నారు. మెరుపులన్ని పిడుగులు కాదని చెప్పారు.