నకిలీ నోట్లు చలామణి ముఠా అరెస్ట్: అవమానంతో చేతిని బ్లేడుతో కోసుకున్న నిందితుడు
కర్నూలు జిల్లాలోని బండిఆత్మకూర్ లో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్నూలు: జిల్లాలోని బండిఆత్మకూర్ లో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 11,900ల నకిలీ నోట్లు, ప్రింటర్, స్కానర్, సామాగ్రి స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేశారు. అయితే ఇందులో తనకు సంబంధం లేదంటూ.. పోలీస్ స్టేషన్లో బ్లేడుతో చేయి కోసుకున్నాడు సుధాకర్ అనే నిందితుడు. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.
లాకప్లో బ్లేడ్తో కోసుకొని ఆత్మహత్య యత్నం చేసిన సుధాకర్ తనపై తప్పుడు కేసు పెట్టి తనను వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తున్నాడు. అవమానం భరించలేక సుధాకర్ ఆత్మహత్యా యత్నం చేశానని చెబుతున్నాడు. శనివారం ఉదయం 100 రూపాయల దొంగ నోట్లను ముద్రించి కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు గ్రామంలో ముద్రించిన దొంగ నోట్లను అదే గ్రామంలో చలామణి చేస్తున్న కొంత మంది యువకులతో తనకు సంభంధం లేదు అంటున్నాడు.
మరో ప్రక్క అదుపులోకి తీసుకున్న యువకులను నంద్యాల డీఎస్పీ గోపాల కృష్ణ సమక్షంలో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టారు. అయితే వీరిలో ఉన్న ఒక నిందితుడు సుధాకర్ తనకు ఈ దొంగ నోట్ల ముఠాకు ఎటువంటి సంబంధం లేదని మొరపెట్టుకున్నాడు.
పోలీస్ వారు కావాలనే తన పేరును ఇరికించి, తనను ముద్దయిగా మీడియా ముందు చూపించడం తనకు అవమానంగా భావించి లాకప్లో తన ఎడమ చేయిని బ్లేడ్తో కోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే అతనిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.