టిపై ముసిగిన జివోఎం కసరత్తు: 6న కేబినెట్ ముందుకు
న్యూఢిల్లీ: తెలంగాణపై మంత్రుల బృందం (జివోఎం) కసరత్తును ముగించింది. కొద్దిపాటి సవరణలతో తెలంగాణ ముసాయిదా బిల్లును జివోఎం సిద్ధం చేసింది. మంగళవారం మధ్యాహ్నం నార్త్ బ్లాకులోని హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో జివోఎం అరగంట పాటు భేటీ అయింది. ఈ భేటీలో నలుగురు సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు పాల్గొన్నారు.
భేటీ అనంతరం కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ... ఈ వారంలోనే తెలంగాణ బిల్లును కేబినెట్ ముందు పెడతామని చెప్పారు. దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ 6వ తేది గురువారం కేబినెట్ సమావేశం కానుంది. అప్పుడు బిల్లును మంత్రివర్గం ముందు పెట్టనున్నారు.
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ.. ఇదే జివోఎం చివరి సమావేశమని తెలిపారు. త్వరలో నివేదికను కేబినెట్ ముందు ఉంచుతామన్నారు. నివేదికలోని కొన్ని సవరణలకు ఆమోద ముద్ర వేశామన్నారు. కాగా, ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
కాగా జివోఎం భేటీకి సీమాంధ్ర కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, దగ్గుబాటి పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణిలు హాజరయ్యారు. కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి, చిరంజీవి, కిశోర్ చంద్రదేవ్, పళ్లం రాజులు హాజరు కాలేదు.
జివోఎం భేటీ సమావేశానికి ముందు కేంద్రమంత్రి జైరామ్ రమేష్ లోనికి వెళ్తుండగా టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనను అడ్డుకున్నారు. సమైక్య నినాదాలతో జైరాంను అడ్డుకున్న టిడిపి నేతలను పోలీసులు పక్కకు తప్పించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జైరాం కాళ్లు పట్టుకొని వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.