63 మంది వార్డు వాలంటీర్లకు షాక్... విధుల్లో నుంచి తొలగింపు... వ్యాక్సిన్ తీసుకోనందుకు...
కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన 63 మంది వార్డు వాలంటీర్లపై వేటు పడింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు వారిని విధుల్లో నుంచి తొలగించారు. వాలంటీర్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం సూచించినప్పటికీ... నిర్లక్ష్యంగా వ్యవహరించి వేటుకు గురయ్యారు. వీరి స్థానంలో కొత్త వాలంటీర్లను నియమించేందుకు సోమవారం(జులై 5) నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని మెమోలు జారీ చేసినప్పటికీ.. వాలంటీర్లు వాటిపై స్పందించలేదని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఫోన్ ద్వారా చెప్పినా వారు పట్టించుకోలేదన్నారు. ఈ నెల 1న ఆత్మకూరులో జరుగుతున్న వ్యాక్సినేషన్ను పరిశీలించిన కలెక్టర్ జిలానీ సామూన్... ఎంతమంది వాలంటీర్లు వ్యాక్సినేషన్ వేయించుకున్నారని ఆరా తీశారు. 63 మంది వాలంటీర్లు వ్యాక్సిన్ వేయించుకోలేదని మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారిపై వేటు వేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ 63 మంది వాలంటీర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

టీటీడీలోనూ వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు వేతనాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఏపీలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. గత నెలలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది. జూన్ 19న ఒకే రోజు 13 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది. గత నెల నాటికే ఏపీ జనాభాలో 20 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు అంచనా. వ్యాక్సిన్ విషయంలోనూ,కరోనా కట్టడి విషయంలోనూ ఏపీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలతో ముందుకు సాగుతోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.శనివారం(జులై 3) కేవలం 2930 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,99,748కి చేరింది. మరో 36 మంది కరోనాతో మృతి చెందగా... రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 12815కి చేరింది.












Click it and Unblock the Notifications