జెపికి తిరుగుబాటు పోటు: పార్టీ నేతల ధిక్కారం
హైదరాబాద్/గుంటూరు: లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై ఆ పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారు. తమ పార్టీకి జాతీయ నాయకత్వమే లేదని, తమ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఎవర్నీ నియమించినా గుర్తించేది లేదని తేల్చి చెబుతున్నారు.
మంగళవారం గుంటూరు పార్టీ కార్యాయంలో లోక్సత్తా పార్టీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాస్, ఏపి అధ్యక్షుడు డివివిఎస్ వర్మ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బద్ధంగా అంతర్గత ఎన్నిక ద్వారా ఎన్నికైన వారి నాయకత్వాన్నే తాము ఆమోదిస్తామని స్పష్టం చేశారు.
జాతీయ నాయకులమంటూ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న పోతినేని హైమ, బొంతు సాంబిరెడ్డిలకు.. లోక్సత్తా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. స్వయం ప్రకటిత నాయకుల ప్రకటనలకూ, పర్యటనలకూ ఎలాంటి విలువ ఇవ్వవద్దని, పార్టీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికైనా దామషా పద్ధతిలో ఎన్నికలు జరిపి జాతీయ నాయకత్వాన్ని నిర్ణయించాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తే పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉండాలనే నిబంధన ఉందని.. అలా కాకుండా మహారాష్ట్రకు చెందిన సురేన్ శ్రీవాత్సవను నియమించారని అన్నారు. ఈ ఎన్నికలను తాము గుర్తించబోమని, ఇవే విషయాన్ని జయప్రకాశ్ నారాయణకు తెలిపామని చెప్పారు.