తండ్రి మావోయిస్టు కీలక నేత: సింహాచలం కొడుకు కానిస్టేబుల్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్-ఒరిస్సా సరిహద్దులోని మల్కాన్గిరి ప్రాంతంలో రెండ్రోజుల క్రితం జరిగిన భారీ ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు ముఖ్య నేత యమలాపల్లి సింహాచలం అలియాస్ మురళీ అలియాస్ హరి కూడా యామలాపల్లి సింహాచలం అలియాస్ మురళీ, అలియాస్ హరి కూడా మృతి చెందారు.
కాగా, ఆయన కుమారుడు మాత్రం తండ్రికి భిన్నంగా పోలీసు శాఖలో చేరడం గమనార్హం. సింహాచలం మృతదేహాన్ని తీసుకుపోయేందుకు వచ్చిన సందర్భంగా ఈ విషయం తెలిసింది. కాగా, గత 25ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ మావోయిస్టు ఉద్యమంలో అంచెంచెలుగా కీలకనేతగా ఎదిగారు సింహాచలం. ప్రస్తుతం డివిజన్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన మల్కాన్గిరి జిల్లా బేజింగ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు.
మల్కాన్గిరి జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో భద్రపరిచిన ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన సింహాచలం కుమారుడు అప్పారావు పోలీస్ కానిస్టేబుల్ కావడం విశేషం. విజయనగరం జిల్లా గరివిడి పోలీస్ స్టేషన్లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. తన చిన్నతనంలోనే కుటుంబాన్ని వదిలి వెళ్లిన తండ్రి విగతజీవుడిగా కనిపించడంతో చలించిపోయాడు.
చిన్నతనం నుంచి ఉద్యమ నేపథ్యం కలిగిన 57ఏళ్ల సింహాచలం 1991లో అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటివరకు ఆయన బొబ్బిలికి చెందిన మావోయిస్టు అగ్రనేత గంటి ప్రసాదంతో కలిసి వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని తెలుస్తోంది. పోలీసు కాల్పుల్లో ప్రసాదం మృతి తరువాత సింహాచలానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పూర్తిగా అజ్ఞాతంలో ఉంటూ మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇటీవలేడివిజన్ కమిటీ సభ్యుడిగా నియమితులైనట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. కుమార్తె వివాహానికి సైతం హాజరు కాలేదు. ఇద్దరు కుమారుల్లో ఒకరు కానిసేస్టేబుల్, మరొకరు మెడికల్ రిప్రజెంటెటివ్గా పని చేస్తున్నారు. సింహాచలం.. కాల్పుల్లో మృతి చెందారన్న సమాచారం తెలియడంతో కుటుంబసభ్యులు ఆవేదనకు గురయ్యారు. 25 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిన తండ్రి గురించి ఇలాంటి కబురు వినాల్సి వస్తుందని భావించలేదని వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.
ఇది ఇలా ఉండగా, ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ మంగళవారం రాత్రి 7 గంటల తరువాత మొదలైంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందబలగకు చెందిన అప్పారావు కుటుంబ సభ్యులతో మల్కాన్గిరి ఎస్పీని ఆయన కార్యాలయంలో కలిశారు.
కానిస్టేబుల్ కావడంతో అప్పారావు మీడియాకు ముఖం చూపకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివిధ పత్రాలపై సంతకాలు తీసుకున్న మల్కాన్గిరి పోలీసులు తరువాత కంటైనర్లో మిగతా మృతదేహాలతోపాటు భద్రపరిచిన సింహాచలం మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు.