ఎన్టీఆర్ వచ్చిన తరువాతే ఉత్తరాంధ్రలో - ప్రమాదం తలెత్తే అవకాశం : బొత్సా..!!
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన వీకేంద్రీకరణ అంశం పైన విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అందులో మంత్రి బొత్సా సత్యానారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎవరిని కించ పరిచే ఉద్దేశం తో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం లేదని చెప్పారు. ఇకపై నిరంతరం ఇలాంటి సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలని అభిప్రాయ పడ్డారు. కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు అందరూ కదలాల్సిన అవసరం ఉందని బొత్సా పేర్కన్నారు. ఇవన్నీ సాధించే వరకూ ఎలాంటి పోరాటాలకైనా సిద్దంగా ఉండాలని బొత్సా పిలుపునిచ్చారు.
ఇష్టానుసారం వ్యాఖ్యలు సరికాదు
సేవా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేదావులు అందరూ వీధుల్లోకి రావాలని సూచించారు. ఇదే సమావేశంలో మంత్రి బొత్సా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధానిపై కొందరి వ్యాఖ్యలు ఇబ్బందికరమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం బద్ధంగా మాట్లాడే అవకాశం అందరికీ ఉంటుంది కానీ సంయమనం పాటించాలని అభిప్రాయపడ్డారు. ఉన్నత పదవుల్లో ఉన్నంత మాత్రాన ఇష్టారీతిగా మాట్లాడకూడదన్నారు. ఇప్పుడు పదవుల్లో ఉండొచ్చు కానీ మన గతం కూడా గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు స్పందించకపోతే పెను ప్రమాదం తలెత్తే అవకాశం ఉందన్నారు.
సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటాము
అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఖర్చు ఎక్కువ పెట్టాల్సి ఉందన్నారు. రైతులు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చారన్నారు. అప్పటి ప్రభుత్వం, అమరావతి రైతులతో ఒప్పందాలన్నింటికీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అక్కడ రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్స్ కూడా జరిగాయని తెలిపారు. ప్రభుత్వం ఎవరికి వ్యతిరేకం కాదు..దండయాత్రలు చేయడం, అడ్డుకోవడం సరికాదు.. మనం వ్యవస్థలో ఉన్నామని అందరూ గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాల్సిందేనని తెల్చిచెప్పారు. మూడు రాజధానుల సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.
ఉత్తరాంధ్రకి నష్టం చేయొద్దు
ఉత్తరాంధ్రకు..కూడా ఒక బెంచ్ కావాలని న్యాయవాదులు కోరుతున్నారని చెప్పారు. గతంలో మన ప్రాంతంలో చాలామంది రాగి అంబలి తినేవారని చెప్పారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రెండు రూపాయలకు కిలోబియ్యం ఇచ్చాక అన్నం తిన్నాం. ఇది వాస్తవమన్నారు. పత్రికలు, పత్రికా యాజమాన్యాలు ఉత్తరాంధ్రకి నష్టం చేయొద్దని హితవు పలికారు. త్వరలో అందరితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి మన ఉద్దేశాన్ని ఘనంగా చాటుదాంమని మంత్రి బొత్సా సూచించారు.