పెళ్లిళ్లు కూడా కావడంలేదు: కిడ్నీ బాధితుల పట్ల చలించిన వపన్
శ్రీకాకుళం: ఉద్ధానం కిడ్నీ బాధితులతో ముఖాముఖి నిర్వహించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. వారి సమస్యలను విని చలించిపోయారు. మంగళవారం ఉదయం ఇచ్ఛాపురంలోని మణికంఠ థియేటర్లో కిడ్నీ వ్యాధిబాధితులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలను వపన్కు వివరించారు.
ఓ బాధితుడు మాట్లాడుతూ.. 'సార్ నేను ఏడాది నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. నెలకు 9నుంచి 10వేల రూపాయిలు వరకు ఆస్పత్రికి ఖర్చు అవుతుంది. మేం చాలా నిరుపేదలం సార్ మాకు సాయం చేయండి' అంటూ తమ గోడును వినిపించారు. మరో కిడ్ని వ్యాధి బాధితురాలు మాట్లాడుతూ.. 'ఉన్న 20సెంట్లు భూమి, ఒంటి మీదున్న బంగారం అంతా అమ్మేసుకుని మూడు నెళ్లనుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం'అని చెప్పారు.
ప్రభుత్వానికి 48గంటల డెడ్లైన్ : కిడ్నీ వ్యాధి బాధితులతో పవన్ ముఖాముఖి(వీడియో)
'తినడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం.. చిన్నపిల్లలున్నారు సార్ మమ్మల్ని ఆదుకోండి' అంటూ ఓ ఆడపడుచు జనసేనానికి విన్నవించుకుంది. 'మనసేమో బ్రతకాలని ఉంది.. ఆర్థిక పరిస్థితి చూస్తే చచ్చిపోవాలనిపిస్తోంది' అంటూ ఓ బాధితుడు చెప్పడం.. పవన్ను తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
పవన్ కళ్యాణ్.. వ్యాధిగ్రస్తుల సమస్యలపై స్పందించటం మంచి విషయమని కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు అన్నారు. వ్యాధిగ్రస్తులకు బస్ పాస్లను కల్పించాలని, వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కిడ్నీ వ్యాధి కారణంగా ఇక్కడి యువతకు పెళ్లిళ్లు కూడా కావడం లేదని తెలిపారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలు విన్న పవన్ కళ్యాణ్ తీవ్రంగా చలించిపోయారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. చిన్నతరాలు కూడా ఈ వ్యాధి భారీనపడటం నిజంగా కలిచివేసిందన్నారు. ఈ సమస్యను గుర్తించి ఇక్కడికి రాజకీయ ప్రయోజనాలు ఆశించిరాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఏ రాజకీయ పార్టీ అయినా, నేతలైనా ప్రజా సమస్యలను సరిదిద్దడానికేనంటూ పవన్ పేర్కొన్నారు.
ఇన్ని సంవత్సరాలు ఈ వ్యాధితో ప్రజలు సతమతమవుతుంటే ప్రభుత్వం ఎందుకు సరైన పరిష్కారం కనుగొనలేకపోయిందో తనకు అర్థం కావట్లేదన్నారు. అనంతరం ప్రజలు కొందరు పవన్కు తమ సమస్యలను వివరించారు. వారు మాట్లాడుతుంటే.. పవన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఏ నాయకుడూ ఇంత వరకు తమ సమ్యలను అడిగిన పాపానపోలేదు.. పవన్ రావడం చాలా ఆనందంగా ఉందంటూ బాధితులు చెప్పారు. కాగా, ఉద్ధానం సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించాలని పవన్ కళ్యాన్ డిమాండ్ చేశారు.