'సొంత తమ్ముడిని కాదనుకుని చందబ్రాబు నీకు సీటిచ్చారు.. మర్చిపోయావా?'
సొంత తమ్ముడిని సైతం కాదనుకుని గతంలో నీకు చంద్రగిరి సీటు ఇచ్చినందుకా నువ్వు చంద్రబాబుపై న్యాయపోరాటం చేసేది? అని పీతల సుజాత రోజాను ప్రశ్నించారు.
విజయవాడ: జాతీయ మహిళా సాధికారత సదస్సుకు తనను ఆహ్వానించి మరీ అవమానించారని ఎమ్మెల్యే రోజా ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలో జరిగిన ఈ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్తుండగా గన్నవరం ఎయిర్ పోర్టులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజాను సదస్సుకు అనుమతించకపోవడం పట్ల మంత్రి పీతల సుజాత స్పందించారు. సదస్సును అడ్డుకుని తీరుతామని రోజా ప్రకటనలు చేసినందుకే ఆమెను పోలీసులు సదస్సుకు అనుమతించలేదని అన్నారు. రోజాను గౌరవమర్యాదలతో పోలీసులు ఆమె ఇంటి వద్ద దిగబెట్టారని పేర్కొన్నారు.
చూస్తూ ఊరుకోం: రోజాకు అనిత హెచ్చరిక, బుట్టా రేణుకపై ఇలా, 'రోజా కంటతడి'
సీఎంపై న్యాయపోరాటం చేస్తానన్న రోజా వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పీతల సుజాత ఫైర్ అయ్యారు. సొంత తమ్ముడిని సైతం కాదనుకుని గతంలో నీకు చంద్రగిరి సీటు ఇచ్చినందుకా నువ్వు చంద్రబాబుపై న్యాయపోరాటం చేసేది? అని పీతల సుజాత రోజాను ప్రశ్నించారు.
న్యాయపోరాటం చంద్రబాబుపై కాదని, మహిళా ఐఏఎస్ లను సైతం జైలుకు పంపించిన జగన్ పై న్యాయపోరాటం చేయాలని సూచించారు. జగన్, రోజా ఇద్దరికీ ప్రజాక్షేమం కన్నా పబ్లిసిటీ మీదున్న మోజే ఎక్కువని అభిప్రాయపడ్డారు.