జగన్, బాబుకి భిన్నంగా: ఇలాకాలో కెసిఆర్తో ప్రతాప్ ఢీ
మెదక్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోటీ చేసి గజ్వెల్ నియోజకవర్గంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కెసిఆర్ గజ్వెల్ నుండి పోటీ చేసినప్పుడే.. తెరాసకు క్యాడర్ లేదని, కాంగ్రసు, టిడిపిలు బలంగా ఉన్నాయని, ఆయన సాహసం చేస్తున్నారనే వాదనలు వినిపించాయి.
దానికి తోడు మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గజ్వెల్లో టిడిపి సత్తా చాటడటంతో మరింత ఆసక్తికరంగా మారింది. కెసిఆర్ ధాటిని ఎదుర్కొని.. గజ్వెల్లో టిడిపి నిలబెట్టిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ రెడ్డి ఇప్పుడు అందరి దృష్టిలో పడ్డారు. పార్టీలో ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దక్షిణ తెలంగాణలో టిడిపి సీనియర్లంతా తెరాస గాలికి తట్టుకోలేక పోయారు.ప్రతాపరెడ్డి.. ఏకంగా కెసిఆర్కు గజ్వేల్ నియోజకవర్గంలో చెమటలు పట్టించారంటున్నారు.
రాష్ట్రంలో ఇతర ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాలు సాధిస్తే కెసిఆర్ పోటీ చేసిన నియోజకవర్గంలో మాత్రం తెరాస చేతులెత్తేసింది. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో మొత్తం నాలుగు మండలాలు ఆ పార్టీకే దక్కాయి. వైయస్ జగన్ పోటీ చేసిన పులివెందులలో మునిసిపాలిటీతోపాటు మొత్తం ఆరు మండలాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కొల్లగొట్టింది. దీనికి భిన్నంగా కెసిఆర్ పోటీ చేసిన గజ్వేల్ మునిసిపాలిటీలో టిడిపి ఎక్కువ కౌన్సిలర్లు గెలిచింది.
నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మూడు టిడిపికి, మూడు కాంగ్రెస్కు దక్కాయి. తెరాసకు ఒక్కటి కూడా దక్కలేదు. గజ్వేల్లో తాను పోటీచేయబోతున్నట్లు కెసిఆర్ ఈ ఎన్నికల కంటే ముందే ప్రకటించారు. తెలంగాణకు అడ్డుపడిన పార్టీగా టిడిపిని ప్రజలు చూస్తున్నారని, చంద్రబాబు పట్ల సానుకూలంగా లేరని రకరకాల కారణాలను తాము బలహీన పడటానికి చూపుతూ వచ్చారు. ఇదే వాతావరణం మెదక్లోనూ ఉన్నా గజ్వేల్లో అంత గట్టి పోటీ ప్రతాప్ రెడ్డి ఎలా ఇవ్వగలిగారన్న ప్రశ్న అందరినీ తొలుస్తోంది.
అయితే, ఇదంతా ప్రతాప్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ అంటున్నారు. ప్రతాప్ రెడ్డి నియోజకవర్గంలో ప్రజలను అంటిపెట్టుకొని పని చేస్తూ వచ్చారంటున్నారు. గజ్వేల్లో కెసిఆర్ ఓడిపోతారని ఎవరూ అనుకోకపోయినా గెలిపించేందుకు తెరాస నేతలు అహర్నిషలు శ్రమించారు.