చంద్రబాబు దారిలో..: నరేంద్ర మోడీకి రామ్దేవ్ బాబా ఝలక్
ప్రధాని నరేంద్ర మోడీకి యోగా గురువు రామ్ దేవ్ బాబా ఝలక్ ఇచ్చారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దును రాందేవ్ స్వాగతించారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి యోగా గురువు రామ్ దేవ్ బాబా ఝలక్ ఇచ్చారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దును రాందేవ్ స్వాగతించారు. అదే సమయంలో ఆయన రూ.2వేల నోట్ల రద్దును వ్యతిరేకించారు. ఈ నోట్ల ముద్రణ నిలిపివేయాలని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రూ.2వేల నోట్ల ముద్రణను నిలిపివేయాలని విజ్ఞప్తి చేసారు. పెద్ద నోట్ల రద్దును చంద్రబాబు స్వాగతించారు. అదే సమయంలో రెండువేల రూపాయల నోట్లను వెనక్కి తీసుకోవాలన్నారు.
షాకింగ్: 'మోడీ నిర్ణయంపై బీజేపీ, ఆరెస్సెస్లో అసంతృప్తి'
ఇప్పుడు, రాందేవ్ బాబా కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసారు. రెండువేల రూపాయల నోట్ల ముద్రణ నిలిపేయాలన్నారు. రద్దు చేసిన నోట్ల వల్ల ఏ సమస్య అయితే వచ్చిందో అదే సమస్య కొత్తగా ప్రవేశపెట్టిన నోట్ల వల్ల ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.
నకిలీ నోట్ల ముద్రణ, రవాణా చాలా సులభంగా ఉందని వాటిని కనిపెట్టడం కష్టంగా మారిందని, అందుకే రూ.2వేల నోట్ల ముద్రణను నిలిపివేయడమే మంచిదన్నారు. ఇటువంటి సమస్యలను ఎదుర్కోవాలంటే నగదు రహిత లావాదేవీలు జరపాలన్నారు.
డిజిటల్ లావాదేవీలు జరపడం వల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని, ఏ ఒక్క రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ వల్ల దేశంలో అచ్ఛే దిన్ రాదని, ప్రజలు ప్రభుత్వంతో కలిసి పనిచేసినపుడే అది సాధ్యపడుతుందన్నారు. అప్పుడే దేశంలో మంచి రోజులు వస్తాయన్నారు.
భూములు, బంగారం, మైనింగ్ ఇలా రకరకాల విభాగాల్లో నల్లధనం ఉందని రాందేవ్ బాబా చెప్పారు. దానిపై ప్రధాని మోడీ అంచెలంచెలుగా చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.