ఇసుక పాలసీ: శాసనమండలిలో సీనియర్ల మధ్య తీవ్ర వాగ్వాదం
హైదరాబాద్: బడ్జెట్, రోజా వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షం, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే తాజాగా ఈ తరహా దృశ్యాలకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా నిలిచింది. ఏపీ శాసనమండలి సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానంపై మంగళవారం చర్చ సాగింది.
ఈ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మండలిలో విపక్ష నేత రామచంద్రయ్య, టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఏపీలో ఉచిత ఇసుక విధానంపై కాంగ్రెస్తో పాటు వైసీపీ చేసిన ఆరోపణలను సోమిరెడ్డి ఖండించారు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక పాలనకు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. దీంతో సి.రామచంద్రయ్య ఒక్కసారిగా మండలిలో ఊగిపోయారు. ఇసుక పాలసీలో ఎవరెంత అక్రమాలకు పాల్పడ్డారో తేల్చేందుకు బహిరంగ చర్చకు సిద్దమా? అని ఆయన సోమిరెడ్డికి సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా సి.రామచంద్రయ్య తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వారిద్దరి తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పిరస్థితి చేయి దాటిపోతోందని గమనించిన మండలి ఛైర్మన్ చక్రపాణి ఇద్దరికి సర్దిచెప్పారు.
తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం : మంత్రి నారాయణ
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఏపీ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లోని డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. పలు జిల్లాల్లో తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు.