ఒకేచోట..: టి బిల్లులో ఏం లేదని టిజి, ఉన్నాయని కొండ్రు
విశాఖపట్నం: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన రాష్ట్ర మంత్రులు ఒకే వేదిక పైన పరస్పరం విరుద్ధంగా స్పందించారు. విశాఖపట్నంలోని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ రైతు శిక్షణా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులు టిజి వెంకటేష్, కొండ్రు మురళిలు భిన్నంగా మాట్లాడారు.
ముసాయిదా బిల్లు సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేసేలా ఉందని టిజి వెంకటేష్ అన్నారు. బిల్లులో ఆర్థిక ప్యాకేజీల గురించి కనీసం ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నందున బిల్లు పైన గట్టిగా వాదించలేకపోతున్నామని చెప్పారు.
తమ లక్ష్యం సమైక్యాంధ్రనే అన్నారు. నేతలు, ప్రజలు ఉంటేనే పార్టీలు అనేవి ఉంటాయన్నారు. సమైక్యాంధ్ర కోసం ఛలో ఢిల్లీ, ఛలో హైదరాబాదుకు ప్రజలు సహకరించాలని కోరారు. విభజన బిల్లు ఎక్కడికి అక్కడ అడ్డుకోవాలని కోరారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో లక్ష్యం, గమ్యం లేదని మరో మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. విభజన వల్ల ఇరు ప్రాంతాలకు ప్రయోజనం లేదన్నారు. తెలంగాణ ఎందుకిస్తున్నారో తెలియదన్నారు.
మరోవైపు మంత్రి కొండ్రు మాత్రం భిన్నంగా స్పందించారు. ముసాయిదా బిల్లులో సీమాంధ్ర అభివృద్ధిపై అన్ని అంశాలను ప్రస్తావించారన్నారు. 2014 ఎన్నికలలో కాంగ్రెసు పార్టీదే గెలుపు అన్నారు. బిల్లులో ఏమీలేదంటూ కాంగ్రెసు ఖాళీ అవుతోందంటూ మీడియా కావాలనే దుష్ప్రచారం చేస్తోందన్నారు. విభజన బిల్లులో సీమాంధ్రకు మేలు జరిగే ఎన్నో అంశాలను కేంద్రం పొందుపర్చిందన్నారు.