బోటు మునక: 36మంది గల్లంతు, ప్రమాదానికి ప్రధాన కారణాలివే!
Recommended Video
కాకినాడ: గోదావరిలో మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో 36మంది ప్రయాణికులు గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. మరో 16మంది ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది మంగళవారం రాత్రి నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. గోదావరి మునిగిన బోటును బయటికి తీసేందుకు భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు. సుమారు 60 అడుగుల లోతున బోటు ఉన్నట్లు తెలిసింది.
350మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. హెలికాప్టర్లను ఉపయోగించి గల్లైంతన వారి కోసం గాలింపు చేపట్టారు. కాగా, మంగళవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు... పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య గోదావరిలో లాంచీ బోల్తా పడింది. ఆ సమయంలో తీవ్రమైన ఈదురుగాలులు వీచడంతో ప్రమాదం సంభవించింది.
దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న లాంచీ బోల్తా పడటంతో 40 మందికి పైగా గల్లంతయ్యారని కొందరు చెబుతుంటే పదిమంది వరకే జలసమాధి అయి ఉంటారని మరికొందరు చెప్పడంతో ఖచ్చితమైన సమాచారం తెలియడం లేదు. దీంతో బోటులో వెళ్ళిన ప్రయాణికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అసలు తమ వారు క్షేమమేనా లేదా అనేది తెలియని స్థితిలో అంతులేని ఆవేదనచెందుతున్నారు.
సాయంత్రం ప్రమాదం
దేవీపట్నం మండలం కొండమొదలు తదితర గ్రామాల వారు మంగళవారం ఉదయమే 7 గంటలకు వివిధ పనులపై కొండమొదలు నుంచి లాంచీలో బయలుదేరారు. 10.30 గంటలకు దేవీపట్నం చేరుకున్నారు. వీరంతా వేర్వేరు చోట్ల తమ పనులన్నీ ముగించుకుని తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో దేవీపట్నం చేరుకున్నారు. దేవీపట్నం పోలీసుస్టేషన్ వద్ద కొంత సేపు ఆగి తర్వాత బయల్దేరింది. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా పడింది.
ప్రమాదానికి ఇవే ప్రధాన కారణాలు?
ఈదురుగాలులు, భారీ వర్షానికి లాంచీలో నింపిన సిమెంట్ బస్తాలు తడిసిపోతున్నాయని సిబ్బంది లాంచీ మూడు గదుల తలుపులు వేసేయడంతో గోదావరిలో లాంచి మునక ప్రమాదంలో తీవ్రత పెరిగింది. అంతేగాక, లాంచీపైన మరో అంతస్తులా ఉండగా దానిపై టెంట్లు వేసి ప్రయాణికులను కూర్చోబెట్టారు. ఈదురు గాలులకు టెంటుకూడా ఊగిపోయి లాంచీ అదుపు తప్పడానికి అదీ కొంత కారణమైందని తెలుస్తోంది. లోపల ఉన్న వారిలో చాలా మందికి ఈత వచ్చినా, లాంచీ తలుపులు మూసివేయడంతో బయటకొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. లాంచీలో పిల్లలు, మహిళలు, పెద్దలు కూడా ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకుని తూర్పుగోదావరి జిల్లా ముంటూరుకు చేరుకున్న ప్రత్యక్ష సాక్షులు ఈ మేరకు వివరాలు అందించారు.
కొందరు బయటపడ్డారు కానీ..
కాగా, లాంచీ సరంగి (డ్రైవర్తో) పాటు సుమారు పదిమంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్నవారిలో తూర్పుగోదావరి జిల్లా ఏజన్సీ ప్రాంతానికి చెందిన గిరిజనులే ఎక్కువ మంది ఉన్నారని, దేవీపట్నం మండలం కె.కొండూరు, కచ్చులూరు, తాళ్లూరు, కొండమొదలు గ్రామాలకు చెందిన వారని తెలుస్తోంది. వీరంతా వివిధ పనుల నిమిత్తం రంపచోడవరం, దేవీపట్నం ప్రాంతాలకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. తిరిగి వారి ఊళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన ప్రాంతం రెండు కొండల మధ్య ఉంది. దాదాపు రెండు తాడి చెట్ల లోతులో నీరుంది. ఆ సమయంలో ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కూడా ఉంది. ఈ ప్రమాదంలో రాముడు, లక్ష్మణుడు అనే కవలలతో పాటు వారి తల్లిదండ్రులు గల్లంతయ్యారు.
బాధితుల ఆవేదన
ఈ ప్రమాదంలో దాదాపు 9 మంది బయటపడ్డట్లు సమాచారం అందింది. కొందరు పశ్చిమగోదావరి జిల్లా వైపు చేరగా...మరికొందరు తూర్పుగోదావరి జిల్లా వైపు చేరారు. లాంచీ డ్రైవర్ దేవీపట్నం పోలీసులకు లొంగిపోయాడు. అయితే అతణ్ని పోలీసులు బయట ఎవరికీ అందుబాటులో ఉంచలేదు. ఎవరితోను మాట్లాడకుండా నియంత్రించారు. వీరితో పాటు తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరుకు చెందిన తండ్రీ కొడుకులు వెంకటేశ్వరరావు, పుల్లయ్య, కొండ మొదలు గ్రామానికి చెందిన అశ్విని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. బ్యాంకులో రుణంగా తీసుకున్న రూ.లక్ష నగదు లాంచీలోనే ఉండిపోయిందని పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టం గణేష్ తోకల రవిబాబు, తోకల పోశమ్మ, కొణితల చిరంజీవి, ఈళ్ల శిరీషలు తూర్పుగోదావరి వైపు చేరుకున్నారు.
సహాయక చర్యలు ముమ్మరం..
కాగా, ఈ ప్రమాద ప్రదేశం తూర్పుగోదావరి జిల్లా అటవీప్రాంతంలో ఉంది. సమీప గ్రామమైన మంటూరు సమీపానికి చేరడమే చాలా కష్టంగా ఉంది. ఆ మార్గం ఏ మాత్రం సహకరించడం లేదు. ఎట్టకేలకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ, రంపచోడవరం సబ్ కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రమాద ప్రాంత సమీప గిరిజన గ్రామానికి చేరుకున్నారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన అధికారులు ప్రమాద ప్రాంతాలకు అటు, ఇటూ చేరుకున్నారు. లాంచీ ప్రమాద ఘటనపై సమాచారం అందగానే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఘటనా స్థలానికి తరలించే చర్యలు చేపట్టింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా విజయవాడ, విశాఖపట్నంలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అక్కడకు తరలించారు.
అనుమతి ఉందా? లైఫ్ జాకెట్లూ ఇవ్వలేదు
ప్రమాదానికి గురైన లక్ష్మీ వెంకటేశ్వర బోట్ సర్వీస్కి అనుమతి ఉందా లేదా అనే విషయమై అధికారుల వద్ద స్పష్టత లేదు. జలవనరుల ఉన్నతాధికారులు తాము అన్ని బోట్లకు అనుమతులు రద్దు చేశామని స్థానిక అధికారులు ఏమైనా ఇచ్చారేమో తెలియదని అంటున్నారు. పోర్టు అధికారులు కూడా ఇదే తరహాలో చెబుతున్నారు. ప్రస్తుతం తామేమీ అనుమతులివ్వలేదని పేర్కొన్నారు. కాగా, ప్రమాదానికి గురైన బోటులో లైఫ్ జాకెట్లు కూడా ప్రయాణికులకు ఇవ్వనట్లు తెలుస్తోంది. లైఫ్ జాకెట్లు అన్ని ఓ మూలన పడేసినట్లు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొందరు ప్రయాణికులు చెబుతున్నారు. బోటు యాజమాన్యం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ బోటు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, సీఎం చంద్రబాబు నాయుడు బాధితులకు అన్ని విధాలా సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోడీ బోటు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గల్లంతైన వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు.