విశాఖ స్కాంలో టిడిపి వాళ్లున్నారా: బాబు ఆరా, మంత్రులున్నా వదలం
విశాఖ భూ కుంభకోణంలో అధికార పార్టీకి చెందిన వారు ఎవరైనా ఉన్నారా? ఇలాంటివి ప్రభుత్వంపై నమ్మకాన్ని పోగొడుతాయని, దీనికి మూలకారకులు ఎవరో తేల్చాల్సిందేనని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతి: విశాఖ భూ కుంభకోణంలో అధికార పార్టీకి చెందిన వారు ఎవరైనా ఉన్నారా? ఇలాంటివి ప్రభుత్వంపై నమ్మకాన్ని పోగొడుతాయని, దీనికి మూలకారకులు ఎవరో తేల్చాల్సిందేనని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
చదవండి: చంద్రబాబు ఆలస్యం, అఖిల దూకుడు.. వైసిపిలోకి శిల్పా
విశాఖ భూకుంభకోణంపై చంద్రబాబు సోమవారం మంత్రులు, అధికారులతో భేటీ అయ్యారు. ఈ స్కాంపై అధికారులు నివేదిక ఇచ్చారు. 288 ఎకరాలు అక్రమాలకు గురయిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అధికార పార్టీ వాళ్లు ఉన్నారా?
ఇలాంటి కుంభకోణాలు ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా చేస్తాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి నుంచి ఈ స్కాంలో ఎవరైనా ఉన్నారా అని చంద్రబాబు అధికారుల నుంచి ఆరా తీశారు. అలాగే ఇతరుల ప్రమేయం పైనా ఆరా తీశారు.
25 మంది అక్రమార్కుల జాబితా
ఈ వ్యవహారంలో ప్రజల నమ్మకం పెరిగేలా విచారణ, చర్యలు ఉంటాయని సీఎం వెల్లడించారు. 2014కు ముందే విశాఖ భూకుంభకోణం వ్యవహారం ఉందని చంద్రబాబుకు అధికారులు వెల్లడించారు. ఈ స్కాంతో సంబంధమున్న 25 మంది పేర్ల జాబితాను ముఖ్యమంత్రికి అధికారులు అందించారు.
సిట్ దర్యాఫ్తు
ఈ కుంభకోణంపై సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. భూవివాదాలకు సంబంధించి ఏర్పాటు చేయనున్న సిట్ నిర్ణీత సమయంలో విచారణ జరిపి మంత్రివర్గ సమావేశంలో దీనిపై నివేదికలు అందజేస్తుంది. దర్యాఫ్తు బృందంలో రెవెన్యూ, పోలీస్, న్యాయ నిపుణులు సభ్యులుగా ఉంటారు.
ఈ ప్రత్యేక బృందం విశాఖలోని వివాదాస్పదమైన మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో వచ్చిన వివాదాలతో పాటు విశాఖ పరిసర ప్రాంతాల్లో వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాయి.
మంత్రులు ఉన్నా చర్యలు
కాగా, భూ ఆక్రమణకు పాల్పడే వారికి రాష్ట్రంలో చోటులేదని, అక్రమాలకు పాల్పడే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హోంమంత్రి చినరాజప్ప హెచ్చరించారు. ఈ కుంభకోణంలో మంత్రులు ఉన్నా, ఎవరు ఉన్నా వదిలేది లేదని తేల్చి చెప్పారు.