శారదా పీఠానికి టీటీడీ భూముల మకిలి- సోషల్ మీడియా పోస్టులపై స్వరూపానంద సీరియస్..
టీడీడీ భూముల విక్రయంపై ఏపీలో జరుగుతున్న రాజకీయంపై తన పేరును ప్రస్తావిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సీరియస్ అయ్యారు. దేవాదాయశాఖ భూములను కాపాడటంలో శారదాపీఠం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, అయినా ఈ వ్యవహారంలో తమను లాగడంపై స్వరూపానంద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా వైసీపీ ప్రభుత్వం టీటీడీ భూముల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాల్లో స్వరూపానంద పాత్ర ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారం కాస్తా స్వామి దృష్టికి రావడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
శారదాపీఠాన్ని, తనను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారానికి దిగుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై న్యాయనిపుణులను స్వరూపానంద సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా శారదాపీఠం ఓ నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు.
వాస్తవానికి టీటీడీ భూముల విక్రయానికి వైసీపీ సర్కారు సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలను స్వరూపానంద వారించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాను సమర్ధించలేనని, శ్రీవారి ఆస్తులను విక్రయించడం వల్ల ప్రజల్లో, భక్తుల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని స్వామి వారించినట్లు తెలిసింది. ఆ తర్వాతే ప్రభుత్వం గతంలో టీడీపీ హయాంలో భూముల విక్రయం కోసం జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ జీవో 888 తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు స్వరూపానందే భూముల విక్రయానికి మద్దతిస్తున్నట్లు పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది.