జే బ్రాండ్ మద్యంపై పోరు..టీడీపీ నేతల గృహనిర్బంధాలు; భగ్గుమన్న తెలుగు తమ్ముళ్ళు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ నాటుసారా, జే బ్రాండ్ మద్యం విషయంలో తెలుగుదేశం పార్టీ ఆందోళన కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీలో కల్తీ నాటుసారా,జే బ్రాండ్ మద్యంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలను సస్పెండ్ చేస్తున్న పరిస్థితి తెలిసిందే. తాజాగా కల్తీ నాటుసారా, జే బ్రాండ్ మద్యం తాగి సంభవించిన మరణాలపై ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలియ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దీంతో ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్దకు టిడిపి నేతలు రాకుండా ముందస్తు గృహనిర్బంధం చేశారు.
విజయవాడలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు.. టెన్షన్ వాతావరణం
విజయవాడలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్, బోండా ఉమ, బోడె ప్రసాద్ , వర్ల రామయ్య లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేతను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తెలుగు దేశం పార్టీ నేతల హౌస్ అరెస్టులతో విజయవాడలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించి ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లడానికి అనుమతి లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో అచ్చెన్నాయుడు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఆటవిక సమాజం లో ఉన్నామా? అచ్చెన్న ఫైర్
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఆటవిక సమాజం లో ఉన్నామా? అని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు హౌస్ అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులను వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం లో 27 మంది కల్తీ సారా తాగి చనిపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అసెంబ్లీలో దీనిపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నా కావాలని సస్పెండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల్లోకి వెళ్లి నిరసన తెలుపకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు: అచ్చెన్నాయుడు
కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్లి నిరసన తెలియజేయడానికి కూడా వీలు లేకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్న అచ్చెన్నాయుడు ప్రజలు జగన్ సర్కార్ కు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని పేర్కొన్నారు.
గద్దె రామ్మోహన్ ఇంటివద్ద పోలీసులు,... ఆందోళన చేసిన టీడీపీ శ్రేణులు
టిడిపి నేత గద్దె రామ్మోహన్ తనను హౌస్ అరెస్టు చేయడంతో వైసీపీ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దె రామ్మోహన్ నివాసం వద్ద పెద్ద ఎత్తున టిడిపి నాయకులు ఆందోళన చేపట్టారు. జే బ్రాండ్ మద్యాన్ని వెంటనే రూపుమాపాలని డిమాండ్ చేస్తూ మద్యం సీసాలతో మహిళలు నిరసన తెలియజేశారు. అసెంబ్లీలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్న స్పీకర్ ఖండించకుండా ఊరుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.
సభలో సీఎం జగన్ తీరుపై గద్దె రామ్మోహన్ ఫైర్
ముఖ్యమంత్రి కూడా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ అవహేళనగా సభలో వ్యవహరించారని గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. కల్తీ సారా తాగి 27 మంది చనిపోతే, ఈ విషయాన్ని సభలో చర్చించకుండా, టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల పట్ల వైసిపి కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. జంగారెడ్డిగూడెంకు టిడిపి సభ్యులు వెళ్లి వస్తే ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా అని ప్రశ్నించిన గద్దె రామ్మోహన్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి వెళ్తే పోలీసులకు ఎందుకు ఉలికిపాటు అంటూ ప్రశ్నించారు.
సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి: బోండా ఉమా
ఏపీలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని, ఈ కల్తీ మద్యం వెనుక వైసిపి నేతలు ఉన్నారని బోండా ఉమ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జంగారెడ్డిగూడెం సారా మరణాలను సహజ మరణాలు అని చెప్పడం సిగ్గుచేటని, అసెంబ్లీ విలువలను మంటగలిపేలా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటన ఉందని బోండా ఉమా మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ సభలో అబద్ధాలు చెప్తున్నారని , తక్షణం క్షమాపణ చెప్పాలని బొండా ఉమా డిమాండ్ చేశారు. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఏపీ మద్యం పరీక్షలు నిర్వహించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు.