26న రైతుల భారత్ బంద్- టీడీపీ మద్దతు- వైసీపీకి మరో సంకటం
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గతంలో ఓసారి భారత్ బంద్ నిర్వహించిన రైతు సంఘాలు.. ఈ నెల 26న మరో ప్రయత్నానికి సిద్ధమయ్యాయి. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్న రైతు సంఘాలు.. భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరుతున్నాయి. ఏపీలో టీడీపీ ఈ బంద్కు మద్దతు ప్రకటించింది. మిగతా పార్టీలు ఇంకా స్పందించలేదు.
రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోరుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కిసాన్ సంయుక్త మోర్చా మార్చి 26న తలపెట్టిన భారత్ బంధ్ కు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. రైతు సంఘాల సమన్వయ కమిటీ, విశాఖ ఉక్కు పోరాట వేధిక సభ్యులు వచ్చి తెలుగుదేశం పార్టీ మద్దతు కోరుతూ ఎమ్మెల్సీలు టి.డి.జనార్ధన్, అశోక్ బాబును కలిశారు. రైతు సమస్యలపై పోరాడేందుకు టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అదే విధంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని తొలి నుండి వ్యతిరేకిస్తున్నామని, ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు ఎప్పుడూ పోరాడతామని తెలిపారు.
అయితే ఈ బంద్కు అధికార వైసీపీ మద్దతిస్తుందా లేదా అన్నది ఇంకా తేలలేదు. మిత్రపక్షాలు బీజేపీ-జనసేన ఎలాగో బంద్కు దూరంగా ఉండే అవకాశం ఉంది. కమ్యూనిస్టులు ఎలాగో బంద్లో భాగం కావడం ఖాయమే. అధికార వైసీపీ బంద్కు మద్దతిచ్చే విషయంలో గతంలో పలుమార్లు చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఈసారి కూడా బంద్ ముందు రోజు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఉన్నందున పరిమితుల మేర బంద్కు బస్సులు నిలిపి మద్దతిచ్చే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది.