ఎమ్మెల్యే అభ్యర్థి వార్డ్లో గెలవలేదు, ఫర్వాలేదని టిడిపి
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. సోమవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లాలోని జనగామకు చెందిన 1వ వార్డు తెరాస అభ్యర్థి కన్నారపు ఉపెందర్ ఒక్క ఓటుతో గెలుపొందారు. నర్సంపేట 5వ వార్డు తెరాస అభ్యర్థి రజిత కూడా ఒక్క ఓటుతోనే విజయం సాధించారు. పరకాలలో ఓ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి, జనగామలో ఓ వార్డు బిజెపి అభ్యర్థి రెండు ఓట్లతో గెలిచారు.
నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో 9వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన లాలూనాయక్ పరాజయం పాలయ్యారు. ఈయన దేవరకొండ తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం గమనార్హం. అయితే లాలూ నాయక్ భార్య లక్ష్మి 12వ వార్డు నుండి పోటీ చేసి గెలుపొందారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి అంత ఆశాజనకంగా లేకపోయినా కొంతవరకూ ఫర్వాలేదని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు జరిగిన 53 మున్సిపాలిటీల్లో తొమ్మిది చోట్ల ఆ పార్టీ ఆధిక్యం సాధించగలిగింది. మూడు చోట్ల స్పష్టమైన మెజార్టీ సాధించింది. బిజెపితో కలిపి చూస్తే పదకొండు చోట్ల తాము చైర్మన్ పదవులను గెలుచుకొనే అవకాశం ఉందని భావిస్తున్నాయి.
ఉత్తర తెలంగాణలో పెద్దగా ఫలితాలను సాధించలేకపోయినా దక్షిణ తెలంగాణలోని రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో కొంతవరకూ నిలదొక్కుకోగలిగింది. మెదక్ జిల్లాలో తెరాస అధ్యక్షులు కెసిఆర్ పోటీ చేసిన గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గజ్వేల్ మున్సిపాలిటీలో ఆధిక్యం సాధించి టిడిపి సంచలనం సృష్టించింది. గజ్వెల్ కోసం తెరాస ముఖ్య నేతలు మకాం వేసినా టిడిపి ఎగురేసుకుపోయింది.