తెలంగాణలో 'అత్తారింటికి దారి, రామయ్యా రావయ్యా'
హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తెలుగు చలన చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన నాటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో భారీ సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ధైర్యం చేయడం లేదు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, జూనియర్ ఎన్టీఆర్ రామయ్యా వస్తావయ్యా, రామ్ చరణ్ తేజ ఎవడు సినిమాలకు లైన్ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ జెఎసిని కోరినట్లు తెలుస్తోంది.
రాజకీయ నాయకులు విభజనపై చేస్తున్న వ్యాఖ్యలు, చర్యలు వారి సంబంధీకులైన సినీ కథానాయకుల తీవ్ర చిత్రాలపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్రమంత్రి చిరంజీవి వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల విడుదలైన తుఫాన్ చిత్రాన్ని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఉద్యమకారులు అడ్డుకుంటామన్నారు. దీంతో ఆ సినిమా ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఇరు ప్రాంతాల ఉద్యమాలతో సినిమా పరిశ్రమ నష్టపోతోందని సినీ నిర్మాతలు, పంపిణీదారులు వాపోతున్నారు.
చిత్రాలను అడ్డుకుంటామన్న ఉద్యమకారుల వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే విడుదల కావాల్సిన భారీ చిత్రాలు వాయిదా పడుతూనే ఉన్నాయి. భారీ వ్యయంతో నిర్మించిన చిత్రాలు వాయిదా పడడంతో వాటిపై వెచ్చించిన ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని నిర్మాతలు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది?‘, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా', రామ్ చరణ్ తేజ్ నటించిన ‘ఎవడు' చిత్రాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. చిన్న చిత్రాలు విడుదలవుతున్నప్పటికీ వాటితో లాభాలు రావడం లేదని థియేటర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కొంతమంది సభ్యులు తెలంగాణ జేఏసీ నేతలను కలిసినట్లు సమాచారం. భారీ చిత్రాలను బ్యాన్ చేయడం సరికాదని, దీని వల్ల నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని జేఏసీ నేతలకు విన్నవించినట్లు తెలిసింది. భారీ చిత్రాలను బ్యాన్ చేయకుండ చూడాలని జేఏసీ నేతలను కోరినట్లు తెలుస్తోంది.