మట్టిబొమ్మ రగడ: దూళిపాళ్ల కౌంటర్, అంటానని కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మంగళవారం శాసన సభలో చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్యాంకుబండు పైన ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాలను మట్టి బొమ్మలు అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గందరగోళం చెలరేగడంతో సభాపతి సభను ఐదు నిమిషాలు వాయిదా వేశారు.
కెటిఆర్ మట్టి బొమ్మలు అనడాన్ని తాము సమర్థించడం లేదని, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మంత్రి దానం నాగేందర్ అన్నారు. అయితే, సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడవద్దని రూలింగ్ ఉందని, సభ్యులు సభలో లేని వారి గురించి మాట్లాడటం ఏమిటని సీమాంధ్ర టిడిపి నేతల ప్రసంగాన్ని ఉద్దేశించి అన్నారు.
త్యాగధనుల విగ్రహాలు
ట్యాంకుబండు పైన స్వర్గీయ నందమూరి తారక రామారావు త్యాగధనులు, మహానుభావుల విగ్రహాలను ఏర్పాటు చేస్తే మట్టి బొమ్మలు అనడం విడ్డూరమని వంగా గీత అన్నారు. కెటిఆర్ తన వ్యాఖ్యలకు జాతికి క్షమాపణ చెప్పాలన్నారు.
సరి చేసుకోవాలి
ట్యాంకుబండు పైన విగ్రహాలను మట్టి బొమ్మలు అనడాన్ని కెటిఆర్ సరి చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. అయితే, గతంలో రాజీవ్, ఇందిర విగ్రహాలను కూల్చడం కూడా హేయమైనదే అన్నారు. వాటిని కూల్చిన వారు జాతికి క్షమాపణలు చెప్పాలన్నారు.
దూళిపాళ్ల కౌంటర్
మహనీయుల విగ్రహాలను మట్టి బొమ్మలని వ్యాఖ్యానించడం సరికాదని దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఇదేనా మీ సంస్కృతి, అహంకారం అని ధ్వజమెత్తారు. గురజాడ చెప్పిన మాటలు చెప్పే వీరే ఆయన విగ్రహాన్ని కూల్చారన్నారు. ఆ విగ్రహాలు ఏర్పాటు చేసిన కమిటీలో కెసిఆర్ కూడా ఉన్నారన్నారు. ఇప్పుడు నిస్సిగ్గుగా వారి అహంకారం బయటపెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఇది వారి నైజమన్నారు. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా రేపు అలాగే అంటారన్నారు. అభ్యుదయ భావాలతో ఎన్టీఆర్ పని చేశారన్నారు.
యస్ అంటాను
సమైక్యవాదంలోని డొల్లతనం వివరిస్తూ.. తాను తెలుగు జాతి అంటారు, తెలుగు వారు అంటారు, తెలుగు భాష అంటారు కానీ సాటి తెలుగు వారి మీద కనికరం లేదని, తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించలేదని అనే ఉద్దేశ్యంతో అన్నానని కెటిఆర్ వివరణ ఇచ్చారు. ట్యాంకుబండు పైన విగ్రహాలను గురించి మాట్లాడితే ఇంత గగ్గోలు అవసరమా అన్నారు.
వంద శాతం అంటామని, తెలంగాణ ఉద్యమంలో వెయ్యిమంది చనిపోతే మాట్లాడాలనే సంస్కారం లేని వారు నాలుగు మట్టి బొమ్మలు కూల్చితే ఇంత రాద్దాంతం చేస్తారా. యస్ అంటాను అని కెటిఆర్ అన్నారు. ఈ దేశంలో ఎందుకుండాలని పయ్యావుల ప్రశ్నించారని, అది యాంటీ నేషనల్ కాదా అన్నారు. ఇతరులకు నీతులు చెప్పే ముందు వారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. విగ్రహాల గురించి మాట్లాడితే మాత్రం ఏదో అపచారం చేసినట్లు మాట్లాడుతున్నారన్నారు.