నిరుద్యోగులకు కోట్ల టోపీ: విమ్స్ డైరెక్టర్ అరెస్టు (ఫొటోలు)
విశాఖపట్నం: విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కేసులో విమ్స్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావును పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సుబ్బారావు అరెస్టు కావడంతో ఆయనను డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తున్నట్టు మంత్రి కామినేని శ్రీనివాస రావు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.
విమ్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రామన్ బల్లా అనే ఒక మోసగాడు చాలా మందిని మోసగించి సుమారు 90 లక్షల రూపాయల వరకూ వసూలు చేసి పరారయ్యాడు. సుమారు నెల రోజుల కిందట రామన్ బల్లాను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా, ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్టు అంగీకరించాడు.
ఈనేపథ్యంలో బాధితులు కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డైరెక్టర్ సుబ్బారావును చూసే తాము బల్లాకు డబ్బులు ఇచ్చామని చెప్పారు. సుబ్బారావు నేరుగా డబ్బులు వసూలు చేయకపోయినా, పరోక్షంగా బల్లా తరపున ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. తాను ఎవరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయలేదని డాక్టర్ సుబ్బారావు పోలీసులకు చెప్పినా ఫలితం లేకుండా పోయింది
ఆయనను ఈ కేసులో రెండో ముద్దాయి (ఎ2)గా చేర్చి, అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపినట్టు ఎసిపి త్రివిక్రమ్వర్మ తెలియచేశారు. కాగా డాక్టర్ సుబ్బారావు నిమ్స్, బర్డ్స్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రుల్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఆయన విమ్స్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.