ఇక ప్రతీ ఇంటా ప్రేమా, అప్యాయతే: బాబును ఏకిపారేసిన జగన్, రోజా, ‘విప్లవాత్మక నిర్ణయాలు’
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ధనియాల చెరువు వద్దకు చేరుకున్న ఆయన.. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
చంద్రబాబు పాలనలో తాగడానికి నీళ్లు దొరకడం లేదు గానీ, ఫోన్ చేస్తే మాత్రం మద్యం బాటిళ్లే ఇంటికి చేరుతున్నాయని జగన్ ఎద్దేవా చేశారు. బెల్టు షాపులు తొలగిస్తామన్న చంద్రబాబు.. ప్రజల ఇంటిపక్కకే వస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు.
పిల్లలకు రూ. 15వేలు, పెన్షన్ రూ.2వేలు
తమ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని చెప్పారు. పిల్లలను చదివిస్తే ఏడాదికి రూ.15వేలు వారి అకౌంట్లలో వేస్తామని జగన్ అన్నారు. అంతేగాక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 45ఏళ్లకే పింఛన్ ఇస్తామని, అది కూడా రూ.2వేల చొప్పున అందజేస్తామని జగన్ చెప్పారు.
Recommended Video
విప్లవాత్మక నిర్ణయాలు
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటామని జగన్ చెప్పారు. కుటుంబాల్లో ప్రేమ, అప్యాయతలు పెంచే కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఇందు కోసం నూరు దఫాలుగా మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు.
మద్యం వల్ల కలిగే నష్టాలను వివరిస్తామని చెప్పారు.
మద్యం లేకపోతే విలవిల్లాడిపోతారు
మద్యం లేకపోవడంతో అలవాటున్న వారు విలవిల్లాడిపోతారని, అందుకోసం వారికి ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకొస్తామని జగన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తామని, ఆ తర్వాతే మళ్లీ ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని జగన్ స్పష్టం చేశారు.
ప్రతీ పేదవాడికీ ఇల్లు
చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి నాలుగేళ్లయినా ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టించలేదని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అందరికీ ఇల్లు కట్టిస్తామని జగన్ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆ ఇంటిని వారిపేరున రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని చెప్పారు. అవసరమైతే ఇంటిని తాకట్టు పెట్టి అప్పుతీసుకునే అవకాశం కల్పిస్తామని, ఆ రుణాలు కూడా పావలా వడ్డీకే ఇస్తామని చెప్పారు.
బాబుపై రోజా ఫైర్
ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా వెర్చలేదన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా ధనియాని చెరువు వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేరుకున్న సందర్భంగా రోజా మాట్లాడారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, విద్యార్థులకు సైకిల్ అంటూ ఎన్నో హామీలు ఇచ్చారని.. వాటిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని రోజా మండిపడ్డారు.
బాబు పాలన అంతమే మన పంథం
పిడికిలి బిగించి మహిళలంతా ఒక శపథం చేయాలని పిలుపునిచ్చిన రోజా.. మహిళల పంతం-చంద్రబాబు పాలన అంతం అంటూ పోరాడాలని అన్నారు. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోందని రోజా అన్నారు. మద్యం కారణంగా ఆడవారిపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు. జగనన్న అధికారంలోకి రాగానే దశల వారిగా మద్యపాన నిషేధం చేస్తారని చెప్పారు.
జగన్ను సీఎం చేయాలి..
చంద్రబాబు ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని, ఆయన మహిళలకు రక్షణ లేదని అన్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్న విజయవాడలోనే మహిళలపై అరాచకాలు ఎక్కువవుతున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. రావణాసురుడు, నరకాసురుడు పాలిస్తే ఎలా ఉంటోందో చంద్రబాబు పాలన కూడా అలాగే ఉందని విమర్శించారు.