రఘురామకు వైసీపీ ఇంకో బిగ్ షాక్: ఆ లిస్ట్ నుంచి పేరు డిలేట్: స్పీకర్కు: ఇక 21 మందే
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వానికి కొరుకుడు పడని తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అటు వైసీపీ నాయకులు, ఇటు రఘురామ.. ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరిస్తోన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని సొంత పార్టీ ప్రభుత్వంపై వరుసగా లేఖాస్త్రాలను సంధిస్తూ వస్తోండగా.. దీనికి ధీటుగా వైసీపీ నాయకత్వం స్పందిస్తోంది. ఢిల్లీ స్థాయి నుంచి నరుక్కొస్తోంది. రఘురామను అనర్హుడిగా ప్రకటించాలంటూ వైసీపీ విప్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్.. స్పీకర్ను కలిశారు.
ఆ తరువాతే అసలు కథ మొదలైంది. రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు వినతిపత్రంతో పాటు మరో జాబితాను కూడా ఆయన అందించినట్లు చెబుతున్నారు. లోక్సభలో తమ పార్టీకి 21 మంది సభ్యులే ఉన్నట్లు గుర్తించాలని మార్గాని భరత్ స్పీక్కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. పార్టీ విప్ హోదాలో ఆయన ఈ జాబితాను అందించారని సమాచారం. ఓ బిర్లాకు అందజేసిన ఈ జాబితాలో ఒక్క రఘురామ కృష్ణంరాజు పేరు మినహా మిగిలిన వారందరి వివరాలను పొందుపరిచారని అంటున్నారు.
2019 నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి, గెలిచిన ఎంపీలతో పాటు.. రాజ్యసభకు ఎంపికైన వారి పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా.. రఘురామ కృష్ణంరాజు సహా మొత్తం 22 మంది అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు స్థానాలను వైసీపీ కోల్పోయింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్సభ స్థానం నుంచి రఘురామ వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. ఆరుమంది రాజ్యసభ సభ్యులను కూడా కలుపుకొంటే- వైసీపీకి ఉన్న మొత్తం పార్లమెంటర్ సభ్యుల సంఖ్య 28.
ఎన్నికలు ముగిసిన కొద్దిరోజుల్లోనే పార్టీతో విభేదించారు. పలు అంశాలపై సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలిని సైతం తప్పుపట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనితో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకత్వం ఒకట్రెండు సార్లు స్పీకర్ ఓం బిర్లాను కలిసి వినతిపత్రం అందజేసింది. తాజాగా మరోసారి విప్ హోదాలో మార్గాని భరత్.. ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రఘురామను తాము పార్టీ ఎంపీగా గుర్తించట్లేదనే విషయాన్ని భరత్ లిఖితపూరకంగా స్పీకర్కు తెలియజేసినట్లు చెబుతున్నారు. లోక్సభలో తమ పార్టీకి 21 మంది సభ్యులు మాత్రమే ఉన్నట్లు గుర్తించాలని ఆయన లిఖితపూరకంగా కోరారని సమాచారం.
ఈ జాబితా ప్రకారం బెల్లాని చంద్రశేఖర్-విజయనగరం, ఎంవీవీ సత్యనారాయణ-విశాఖపట్నం, గొడ్డేటి మాధవి-అరకు, డాక్టర్ సత్యవతి-అనకాపల్లి, వంగా గీత-కాకినాడ, చింతా అనూరాధ-అమలాపురం, మార్గాని భరత్-రాజమండ్రి, కోటగిరి శ్రీధర్-ఏలూరు, బాలశౌరి-మచిలీపట్నం, లావు శ్రీకృష్ణదేవరాయలు-నరసరావుపేట, నందిగం సురేష్-బాపట్ల, మాగుంట శ్రీనివాసరెడ్డి-ఒంగోలు, ఆదాల ప్రభాకర్ రెడ్డి-నెల్లూరు, డాక్టర్ గురుమూర్తి-తిరుపతి (ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది), పోచా బ్రహ్మానందరెడ్డి-నంద్యాల, డాక్టర్ సంజీవ్ కుమార్-కర్నూలు, తలారి రంగయ్య-అనంతపురం, గోరంట్ల మాధవ్-హిందూపురం, ఎన్ రెడ్డెప్ప-చిత్తూరు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి-రాజంపేట, వైఎస్ అవినాష్ రెడ్డి-కడప, వీ విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ పేర్లు మాత్రమే ఉన్నాయి.