కిడ్నాపైన 2 గంటల్లోపే తల్లి చెంతకు పసికందు.. శభాష్ పోలీస్..
సంచలనం సృష్టించిన పసికందు కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమయ్యింది. గుంటూరు జీజీహెచ్లో పసికందు కిడ్నాప్ కలకలం రేపింది. మూడు రోజుల మగ శిశువును శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. పసికందు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రెండు గంటల్లో బాబు ఆచూకీని కనుగొన్నారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు.
ఇద్దరు కలిసి..
జీజీహెచ్ లో వార్డుబాయ్ గా పనిచేసే హేమ వరుణుడు బాబును ఎత్తుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అతడికి పద్మఅనే మహిళ సహకరించినట్టుగా తెలుస్తోంది. హేమ వరుణుడు, పద్మకు వివాహేతర సంబంధం ఉంది. బాబును ఎత్తుకెళ్లి విక్రయించాలని ఇద్దరూ స్కెచ్ వేశారు. శుక్రవారం అర్ధరాత్రి బాబును ఎత్తుకెళ్లారు. గుంటూర్ నెహ్రూనగర్లో ఒకటో లైనులో బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల ఆచూకీ లభ్యమైంది.
పురుడు కోసం వస్తే..
పెదకాకానికి చెందిన ప్రియాంక ఈ నెల 11వ తేదీ రాత్రి కాన్పు కోసం జీజీహెచ్ లో చేరింది. ఈ నెల 13న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెతోపాటు భర్త, అత్త, అమ్మ ఆస్పత్రిలోనే ఉన్నారు. శుక్రవారం రాత్రి బాబుకు పాలుపట్టించిన నానమ్మ... బాత్ రూమ్కు వెళ్తూ.. అమ్మమ్మ పార్వతమ్మ దగ్గర పడుకోబెట్టింది. ఆమె వచ్చి చూసేసరికి బిడ్డ కనపించలేదు. దీంతో వారు ఆస్పత్రి సిబ్బందికి విషయాన్ని తెలిపారు. ఆస్పత్రి అధికారులు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ ఫుటేజ్ లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించారు. బిడ్డను సంచిలో పెట్టుకొని వెళ్తున్నట్లు గుర్తించారు. వారు వెళ్లిన మార్గంతోపాటు సిబ్బంది కూడా నిదింతులు అని గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ వివరాల ఆధారంగా దర్యాప్తు చేయగా వార్డు బాయ్ బాబును ఎత్తుకెళ్లినట్లు తేలింది.
ఇలా దొరికారు
పోలీసుల సమయస్ఫూర్తి, సాంకేతిక పరిజ్ఞానం వల్ల గంటల వ్యవధిలోనే బాబును గుర్తించామని తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న సీసీ కెమెరాలు నిందితులను పట్టించాయి. గంటల వ్యవధిలో బాబును తీసుకొచ్చిన పోలీసులకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మనస్ఫూర్తికి థాంక్స్ తెలిపారు. మూడు రోజుల పసికందు కనిపించకుండా పోవడంతో అందరూ ఆందోళన చెందారు. తల్లి ప్రియాంక తల్లడిల్లిపోయింది. బాబు ఆచూకి తెలపాలంటూ అధికారులను వేడుకుంది. అటు ఆస్పత్రి అధికారులు, సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
ఎందుకంటే
పోలీసులతో పాటు ఆస్పత్రి సిబ్బంది, బాబు బంధువులు గాలింపు చర్యలు చేపట్టడంతో వెంటనే గుర్తించగలిగారు. మొత్తానికి బాబు ఆచూకీ దొరకడంతో అధికారులు కూడా రిలాక్స్ అయ్యారు. తొలుత బాబును వైద్యపరీక్షల కోసం వైద్యులకు అప్పగించిన పోలీసులు.. ఆ తర్పాత తల్లి చెంతకు చేర్చారు. నిందితులను విచారించి మరిన్ని వివరాలు రాబడతామని పోలీసులు తెలిపారు.