సిటీ నుంచి పల్లెకు కరోనా.. గ్రామాల్లో వైరస్ విజృంభణ
రోజు రోజు కరోనా కేసులు పెరుగుతున్నాయి. చలికాలంలోనే ఎక్కువ రావడంతో ఆందోళన నెలకొంది. ఇటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా బెంబేలెత్తిస్తోంది. ఈ సమయంలోనే సంక్రాంతి పండగ వచ్చింది. ఇంకేముంది పట్టణం/ నగరాల నుంచి జనం ఊర్లకు వెళ్లారు. వీరి వల్ల కూడా కేసులు విస్తరిస్తున్నాయి. అవును తెలుగు రాష్ట్రాల్లోనే కేసులు ఎక్కువగా వచ్చాయి. తెలంగాణలో కేసులు భారీగా వస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో..
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గత రెండు వేవ్ల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండగా.. వ్యాప్తి మాత్రం కంట్రోల్లోనే ఉంది. ఈసారి మాత్రం వ్యాధి తీవ్రత కంటే వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటికే గ్రేటర్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండగా.. పండగలకు జనం గ్రామాలకు తరలి వెళ్లడంతో అక్కడ వ్యాప్తి పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పండగ వేళ పట్నం నుంచి జనంతో పాటు కరోనా కూడా పండక్కి వచ్చేసింది. దీంతో కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకూ పట్టణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఇప్పుడు గ్రామాల్లో ఉధృతి కనిపిస్తోంది.
పెరిగిన కేసులు
రాష్ట్రంలో గత 24 గంటల్లో 2700కు పైగా కేసులు వచ్చాయి. సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వారం రోజులుగా 15 జిల్లాల్లో భారీగా కేసులు వస్తున్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, నాగర్కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో గత వారంరోజులతో పోల్చితే కేసుల సంఖ్య పెరిగినట్లు చెబుతున్నారు.
జిల్లాల్లో ఇలా
పండగ సందర్బంగా రాకపోకలు ఎక్కువగా ఉండటంతో కేసుల సంఖ్య పెరుగుతున్నాయని వైద్యాధికారులు తెలిపారు. మంచిర్యాలలో ఏడు రోజుల్లో కేసులు మూడింతలకు పైగా పెరిగాయి. భద్రాద్రి కొత్తగూడెంలో రెట్టింపు స్థాయిలో కేసులు వచ్చాయి. వికారాబాద్లో ఈ నెల 7వ తేదీన 9 కేసులు వస్తే నిన్న 36 మంది దీని బారిన పడినట్టు గుర్తించారు. గ్రేటర్ పరిధిలో మాత్రం కేసులు ఆ వేగంతో పెరగకపోవడం ఒక్కటే ఊరట కలిగిస్తోంది. ఈ నెల 7వ తేదీన 1452కేసులు రాగా నిన్న 1328మందికి వైరస్ సోకింది.