దీక్షతోనే ప్రభుత్వంలో కదలిక.. వెంటనే మంత్రులు వాలారు: షర్మిల విసుర్లు
ఆరేళ్ల చిన్నారిని నిందితుడు రాజు అత్యాచారం చేసి, హతమార్చిన సంగతి తెలిసిందే. వారం రోజులుగా పోలీసులు నిందితున్ని పట్టుకోలేదని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. ఇటు ప్రభుత్వం కూడా స్పందించలేదన్నారు. సీఎం నుంచి కార్పొరేటర్ స్థాయి వరకు ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. అందుకు నిరసనగా బుధవారం నిరసన దీక్ష చేశానని.. దీక్ష చేసిన తర్వాతే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. పోలీసుల్లో కదలిక వచ్చి.. ఆ రోజు సాయంత్రం హోంమంత్రి పోలీసులతో మాట్లాడారని వివరించారు. ఇవాళ ఉదయం హోంమంత్రితోపాటు గిరిజన మంత్రి ఆ కుటుంబం వద్దకు వెళ్లి సాయం చేస్తామని చెప్పారని వివరించారు. దీక్ష మొదలు పెట్టిన తర్వాతనే వారిలో కదలిక వచ్చి, ఈ కేసు ఇంత వరకు రాగలిగిందన్నారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమపై దాదాపు 200 మంది పోలీసులు రంగంలోకి దిగి, బలంవంతంగా వాహనాల్లో లాక్కెళ్లి, హౌజ్ అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. దీక్ష చేసినప్పుడు రాళ్లు లేవు.. కట్టెలు లేవు.. బాంబులు లేవు... మారణాయుధాలు అసలే లేవు.. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా దీక్ష చేస్తున్నాం. అర్ధరాత్రి దాటాక, జనాలు లేనప్పుడు దొంగల్లా వచ్చి మమ్మల్ని పోలీసులు లాక్కెళ్లారు. శాంతియుతంగా నిరసన, దీక్ష చేసే హక్కు దేశ ప్రజలకు లేదా? అని షర్మిల ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యం ఉందా..?
తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా? అని షర్మిల అడిగారు. శాంతియుతంగా చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారని ఆరోపించారు. ఇది తాలిబన్లను తలపించే విధంగా ఉందన్నారు. తాలిబన్ల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ బందీ అయినట్లు, కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ అయిందని పేర్కొన్నారు. తెలంగాణలో నియంత పాలన సాగుతోందన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని హౌజ్ అరెస్ట్ చేయడం, ఇంకొంత ఎక్కువ నిరసన తెలిపితే జైలులో పెట్టడం కేసీఆర్కు అలవాటయ్యిందని చెప్పారు. ఇదే కేసీఆర్కు తెలిసిన న్యాయం? అని ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. అసమర్థ ప్రభుత్వం, పోలీసులు చేయని న్యాయం.. ఆ దేవుడు చేశాడు. ముమ్మాటికీ ఇది కేసీఆర్ వైఫల్యమే. ఇంతటి భయానక హత్యాచారాలు జరుగుతుంటే నిందితుల్ని పట్టుకుని, కఠినంగా శిక్షించకపోవడంతోనే ఆడబిడ్డలు, మహిళలపై హత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పారు. దీనికి నిదర్శనమే ఈ రోజు జగిత్యాలలో ఐదేళ్ల బాలికపై జరిగిన దాడి, హైదరాబాద్ లో తొమ్మిదేళ్ల అమ్మాయిపై జరిగిన అత్యాచారయత్నం అని పేర్కొన్నారు. ఓ వైపు దీక్ష చేస్తున్నా.. మరో వైపు క్యాండిల్ ర్యాలీలు తీస్తున్నా.. ప్రజలు నిరసన తెలుపుతున్నా.. దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ప్రభుత్వం పట్టింపులేనితనమే అని మండిపడ్డారు. పోలీసులు స్పందించకపోవడంతో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతోనే హంతకులు రెచ్చిపోతున్నారు. వీరికి కేసీఆర్, కేటీఆర్ పరోక్షంగా ధైర్యం కల్పించారని షర్మిల ఆరోపించారు.
యువత ఏం చేస్తున్నారు..?
భగత్ సింగ్ చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే.. అలాంటి మహనీయున్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన యువత.. నేడు ఏ ఆశయం లేకుండా దీనికి కారణం మత్తు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా దొరుకుతోందన్నారు. దీనిని అరికట్టాల్సిన అవసరం కేసీఆర్ పైన ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయని మహిళలు చెబుతున్నారు. తమ పిల్లలు వీటిని బానిసవుతున్నారని ఏడుస్తున్నారని గుర్తుచేశారు. ఆడ పిల్లలు, మహిళలు బయట అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారని పేర్కొన్నారు. తమ పరిస్థితి దారుణంగా ఉందని రోదిస్తున్నారు. వీరందరికీ కేసీఆర్ ఏ సమాధానం చెబుతారు? ఇవాళ తెలంగాణలో 3,200 స్కూళ్లను మూసివేశారు. 14 వేల టీచర్లను ఉద్యోగాల నుంచి తీసివేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు.. జాబ్స్ లేవు.. యువతను మొత్తం మద్యం మత్తులో ముంచేస్తున్నారు కేసీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ సీఎం అయ్యాక 300 శాతం మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని.. దీనికి కారణం మద్యం. గల్లీకో బారు.. వీధికో వైన్ షాప్... ఎక్కడికి వెళ్లినా మద్యం ఏరులై పారుతోంది. తెలంగాణలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ఎన్ని బార్ షాపులు ఉన్నాయి? ఎన్ని గుడిలు ఉన్నాయి? ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి? కేసీఆర్ ఆలోచించుకోవాలని సూచించారు.
Recommended Video
పెరుగుతున్న ఆదాయం.. దేనిదంటే
తెలంగాణలో మద్యం ఆదాయం 2014-15లో రూ. 10.88 వేల కోట్లు ఉంటే.. 2020-21 నాటికి రూ.27.28 వేల కోట్లు పెరిగింది. అంటే 300 శాతం ఎక్కువ పెరిగింది. మహిళలపైనా 300 శాతం అత్యాచారాలు పెరిగిపోయాయి? దీనికి దానికి సంబంధం లేదంటారా? యువత మద్యం, గంజాయికి అలవాటు పడి, ఏం తెలియని చిన్న పిల్లలను టార్గెట్ చేస్తున్నారు. ఇంత నీచ స్థాయికి తెలంగాణను కేసీఆర్ దిగజార్చారని మండిపడ్డారు. ఇకనైనా ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఇది బంగారు తెలంగాణనా? బర్ బాత్ అవుతున్న తెలంగాణనా? ప్రజలు ఆలోచన చేయాలి. ఇలాంటి అరాచకాలను అరికట్టాలని కేసీఆర్ను డిమాండ్ చేశారు. దేవుడే శిక్ష వేస్తుంటే మరి సీఎం ఎందుకు ఉన్నట్టు? మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం ఎందుకు ఉన్నట్టు? అని షర్మిల ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం పేరుకే ఉందా అని అడిగారు.