బీఆర్ఎస్ లో కవితకు ముఖ్య పదవి - ఇద్దరి చేతికి పగ్గాలు ..!!
ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రాంగం ప్రారంభించారు. బీఆర్ఎస్ ఏర్పాటు తరువాత తొలి సారి ఢిల్లీ వెళ్లిన ఆయన పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఢిల్లీలో సిద్దమవుతున్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. పార్టీ పేరు కోసం ఇప్పటికే ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ చేసినతీర్మానంతో పాటుగా అవసరమైన దస్త్రాలు అందించారు. ఇక, ఇప్పుడు పార్టీ నిర్మాణం పైన ఆయన ఫోకస్ పెట్టారు.
ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ రాజకీయం
బీఆర్ఎస్ పార్టీ ప్రకటన సమయంలో కల్వకుంట్ల కవిత సమావేశానికి హాజరు కాలేదనే ప్రచారం సాగింది. ఇప్పుడు ములాయంకు నివాళి అర్పించేందుకు తండ్రి కేసీఆర్ తో పాటుగా కవిత కూడా వెళ్లారు. పార్టీ ప్రకటనకు ముందు సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాల్లో అక్కడి పార్టీల అధినేతలతో జరిగిన సమావేశాల్లోనూ కవిత పాల్గొన్నారు. లోక్ సభ సభ్యురాలిగా వ్యవహరించిన కవితకు ఢిల్లీలోని పలు పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కుమారుడు కేటీఆర్ ను పూర్తిగా తెలంగాణ రాజకీయాలు - పార్టీ బాధ్యతలను కేటీఆర్ అప్పగించారు. ఇప్పటికే కేటీఆర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించారు. ఇప్పుడు టీఆర్ఎస్ - బీఆర్ఎస్ మారుతున్న సమయంలో కవితకు ఏ పదవి దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. బీఆర్ఎస్ కు అధ్యక్షుడిగా కేసీఆర్ వ్యవహరించనున్నారు.
జాతీయ స్థాయిలో కవితకు బాధ్యతలు
అదే సమయంలో వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు సీఎంగా కొనసాగుతూనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తన పాత్రకు సిద్దమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయం సాధిస్తామనే నమ్మకంతో టీఆర్ఎస్ అధినాయకత్వం ఉంది. ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉండటంతో..అసెంబ్లీ ఫలితాల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో పదవుల విషయంలో కీలక నిర్ణయాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో జేడీఎస్ తో బీఆర్ఎస్ కు మధ్య పొత్తు ఖాయమైంది. మహారాష్ట్రాలో అక్కడి రైతుల సమస్యల పైన బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, ఏపీలో బీఆర్ఎస్ ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది.
ఇద్దరూ క్రియాశీలకంగా - పదవులు
కానీ, ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ బాధ్యతలను కుమార్తె కవిత కు అప్పగించటం ఖాయమనే వాదన పార్టీలో వినిపిస్తోంది. పార్టీ జాతీయ కన్వీనర్ బాధత్యలు అప్పగిస్తారంటూ పార్టీ నేతల మధ్య ప్రచారం సాగుతోంది. ఇటు తెలంగాణలో కేటీఆర్ పాలనా పరంగా - పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకూ హైదరాబాద్ లో ఎన్నికలు - పాలనా నిర్ణయాలకే పరిమితమైన కేటీఆర్, ఇప్పుడు మునుగోడులో బాధ్యతలు స్వీకరించారు. మంత్రులతో కలిసి మునుగోడు గెలుపు కోసం పని చేస్తున్నారు. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని.. ప్రధాని మోదీ నిర్ణయాలను..రాష్ట్రంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. దీంతో..రానున్న రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో జాతీయ స్థాయిలో కవిత - తెలంగాణలో కేటీఆర్ కీలక పదవుల్లో నిలిచేలా రంగం సిద్దం అవుతోంది.