24 నుంచి అసెంబ్లీ సెషన్.. 10 రోజులు నిర్వహించే ఛాన్స్..?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం అవనున్నాయి. 10 రోజులపాటు శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ సన్నద్ధత గురించి మంత్రివర్గం చర్చించింది. రాష్ట్రంలో పంటల సాగు, దిగుబడి అంచనాలపై కూడా సమీక్షించింది.
వానాకాలం పంటల కొనుగోళ్లపై మార్కెటింగ్ శాఖ సన్నద్ధత గురించి కూడా డిస్కస్ చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలు, పరిష్కారంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రి సత్యవతిరాథోడ్ చైర్మన్గా, మరో ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీని నియమించింది. రాష్ట్రంలో హోం శాఖపైనా సమీక్షించింది. అంతకుముందు కరోనా పరిస్థితులపై చర్చ జరిగింది. వైద్య ఆరోగ్య శాఖపై మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ మంత్రులు సమీక్షించారు. పక్క రాష్ట్రాల్లో పరిస్థితులు, ఆయా రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై.. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో స్కూళ్లు పునఃప్రారంభమైన తర్వాత పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ.. కేబినెట్కు నివేదిక అందజేసింది. విద్యాసంస్థలు తెరుచుకున్నా.. కేసులు పెరగలేదని.. రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందంటూ కేబినెట్కు వివరించింది. ఇప్పటివరకు అయితే కరోనా కేసులు నియంత్రణలోనే ఉన్నాయని పేర్కొన్నారు.
మరోవైపు ఇప్పటికే రూ.50 వేల లోపు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. ఆపై కూడా మాఫీ చేస్తామని తెలియజేసింది. రూ. లక్ష లోపు రుణం మాఫీ చేస్తామని సంకేతాలను ఇచ్చింది. రైతు రుణమాఫీలో భాగంగా రూ.50 వేల నుంచి లక్ష లోపు రుణాలు కలిగి ఉన్న రైతుల ఖాతాల్లోకి వడ్డీతో సహా జమచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఇప్పటికే రూ.50 వేల లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తికావొస్తుందరి వివరించారు. లక్ష లోపు రుణమాఫీకి సంబంధించి వచ్చే మార్చి బడ్జెట్లో నిధుల కేటాయింపు చేసేలా సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు.