సిట్ అధికారిపై ఏసీబీ కోర్టు అగ్రహం.. డైరెక్షన్ ఇవ్వటానికి మీరెవరంటూ ప్రశ్న..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ అధికారి గంగాధర్ పై ఏసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుల బెయిల్ షూరిటీలో స్థానికులనే పరిగణలోకి తీసుకోవాలని.. సిట్ మెమో జారీ చేయడంపై న్యాయమూర్తి మండిపడ్డారు. షూరిటీలపై డైరెక్షన్ ఇవ్వటానికి మీరెవరంటూ నిలదీసింది. బేరతుగా క్షమాపణలు చెప్పకుంటే... కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని స్ఫష్టం చేసింది. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సిట్ అధికారి ఏసీపీ గంగాధర్ కోర్టుకు క్షమాపణ చెప్పారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ప్రతీ సోమవారం సిట్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించొద్దని స్పష్టం చేసింది. నిందితులంతా పాస్ పోర్టులను సిట్ ఇవ్వాలని కోర్టు చెప్పింది. రూ.3 లక్షల పూచికత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల షూరిటీతో బెయిల్ మంజూరు చేసింది.
ఈ షూరిటీ ఇచ్చే వారు స్థానికులు అయి ఉండాలని సిట్ మెమో ఇచ్చింది. దీంతో కోర్టు సిట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా నిందితులు 34 రోజులుగా చంచల్గూడ జైలులో ఉన్నారు.ఈ కేసులు ఇప్పటికే సిట్ పలు సార్లు నిందితులను విచారించింది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారికి నోటీసులు కూడా జారీ చేసింది.