ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - జడ్జీల్లో భేదాభిప్రాయాలు..!!
న్యూఢిల్లీ: రిజర్వేషన్లల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థించింది. దేశవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తూ రాజ్యాంగంలో చేపట్టిన 103వ సవరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
ఏడు రోజుల పాటు విచారణ..
2019లో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ విధానంలోని వివిధ అంశాలకు సంబంధించిన దాఖలైన 40 పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తుది నిర్ణయాన్ని ప్రకటించింది. ఇదివరకే ఆయా పిటీషన్లన్నింటినీ విచారణకు స్వీకరించింది. ఏడు రోజుల పాటు ఈ విచారణ కొనసాగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ సారథ్యంలోని అయిదు మంది న్యాయమూర్తుల ధర్మాసనం కొద్దిసేపటి కిందటే తన నిర్ణయాన్ని వినిపించింది.
వ్యతిరేకించిన న్యాయమూర్తి..
జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఎస్ రవీంద్రభట్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ జేబీ పార్డీవాలా ఈ ధర్మాసనంలో ఇతర సభ్యులుగా ఉన్నారు. 4:1 నిష్పత్తితో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటాను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. జస్టిస్ ఎస్ రవీంద్రభట్ మాత్రం దీన్ని గట్టిగా వ్యతిరేకించారు. రిజర్వేషన్లల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ప్రత్యేకంగా మరో కోటాను ఏర్పాటు చేయడం సరి కాదని పేర్కొన్నారు.
రాజ్యాంగ సవరణ..
రిజర్వేషన్లల్లో ఈడబ్ల్యూఎస్కు 10 శాతం కోటాను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో రాజ్యాంగాన్ని సవరించింది. ఇది రాజ్యాంగ 103వ సవరణ. దీన్ని సవాల్ చేస్తూ పలు పిటీషన్లు దాఖలయ్యాయి. జనహిత అభియాన్ సంస్థ పిటీషన్లు వేసింది. 2019 జనవరిలో పార్లమెంట్ ఆమోదించిన సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16లోని క్లాజ్ (6)ని కొత్తగా తీసుకుని రావడం ద్వారా విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించింది.
విద్య, ఉద్యోగాల్లో..
కొత్తగా తీసుకొచ్చిన ఈ ఆర్టికల్ 15 (6) విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో సహా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ప్రయోజనాలను తీసుకొచ్చింది. దీనికోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించడానికి రాష్ట్రానికి వీలు కల్పించింది. ఆర్టికల్ 30 (1) పరిధిలోకి వచ్చే మైనారిటీ విద్యాసంస్థలు మినహా, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చని పేర్కొంది. రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 10 శాతంగా నిర్ధారించింది. ఇది ప్రస్తుత రిజర్వేషన్లకు అదనంగా ఉంటుందని అప్పట్లో కేంద్రం పేర్కొంది.