‘అయోధ్య’పై సయోధ్య దిశగా అడుగులు? ముస్లింలంతా అంగీకరిస్తారా?
అయోధ్యలో బాబ్రీ మసీదు - రామ జన్మభూమి వివాదం ఏడు దశాబ్దాలుగా ప్రత్యేకించి 1992 నుంచి కొనసాగుతూ వస్తున్నది. దీని పరిష్కారానికి మార్గాలు సుగమం అవుతుందన్న సంకేతాలు లభిస్తున్నాయి.
అలహాబాద్: అయోధ్యలోని రామ మందిరం-బాబ్రీ మసీదు వివాదం పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘంగా చర్చలు జరిపిన అఖిల భారతీయ అఖాడా పరిషత్, ఉత్తర్ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డులు దీనిపై సామరస్యపూర్వకంగా ఓ అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్ని ఇరు పక్షాల నేతలు సోమవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
ఈ వివరాలను త్వరలోనే సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు. ఈ కేసుపై సుప్రీంకోర్టులో వచ్చే నెల ఐదో తేదీ నుంచి తుది విచారణ జరగనున్నది. ఒప్పందం కుదిరిందని, షరతులు-నిబంధనలను ఖరారు చేసే పనిలో ఉన్నామని ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు అధిపతి వాసీం రిజ్వి తెలిపారు. అయోధ్యలోగానీ, ఫైజాబాద్లోగానీ కొత్త మసీదును నిర్మించకూడదన్న విషయమై సానుకూల దృక్పథంలో అంగీకారం కుదిరిందని చెప్పారు.
ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న చోట నూతన మసీదును నిర్మించాలని, ఆ ప్రాంతాన్ని గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించినట్టు వివరించారు. చర్చల్లో రామ జన్మభూమి ట్రస్ట్ చైర్మన్ న్రుత్య గోపాల్ దాస్ కూడా పాల్గొన్నారు
అన్ని వర్గాలతో సంప్రదించామన్న నరేంద్రగిరి
ఈ సమస్యను యూపీ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ రిజ్వీ పరిష్కరించారని అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరి వెల్లడించారు. చర్చలపై అందరితో సంప్రదించామని తెలిపారు. మరోవైపు శ్రీశ్రీ రవిశంకర్ జోక్యం అవసరం లేదని ఇప్పటికే హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తేల్చి చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపీఎల్బీ) నిర్ణయం కూడా కీలకమేనన్న అభిప్రాయం ఉన్నది.
రామ మందిరంపై అఖిల భారతీయ అఖాడా పరిషత్ ఇలా గ్యారంటీ
వచ్చే ఏడాది డిసెంబర్ ఆరో తేదీ లోగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్రగిరి సంకేతాలిచ్చారు. ఈ విషయమై జరుపుతున్న చర్చల్లో వచ్చే ఏడాది డిసెంబర్ 6కు (బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన రోజు) ముందే ఫలితాలు లభిస్తాయని అంచనా వేశారు. బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదంపై ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం అఖాడా పరిషత్ ప్రతినిధులకు, యూపీ షియా వక్ఫ్ బోర్డు అధిపతి వాసిం రిజ్వీతో ఒప్పందం కుదిరింది. అయితే ఫైజాబాద్లో లేదా అయోధ్యలో మసీదు నిర్మాణానికి అఖాడా పరిషత్ వ్యతిరేకమని నరేంద్రగిరి చెప్పారు. షియా వక్ఫ్బోర్డు అధిపతి వాసిం రిజ్వీ మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి ముసాయిదా ఒప్పందం రూపొందిస్తున్నామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ఏజంట్గా రవిశంకర్: కాంగ్రెస్
రామ మందిరం వివాదంలో తనకు తాను ఇష్టపూర్వకంగా మధ్యవర్తిత్వం వహిస్తానని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ తెలిపారు. ఈనెల 16న అయోధ్యలో పర్యటించి సంబంధిత ప్రతినిధులందరినీ కలవనున్నట్లు సోమవారం వెల్లడించారు. తన పర్యటనకు సంబంధించి ప్రత్యేకంగా అజెండా ఏమీలేదని.. ప్రతిఒక్కరు చెప్పిందీ ఆలకిస్తానని వివరించారు. రామ మందిర నిర్మాణం అంశంపై బుధవారం అయోధ్యకు వెళ్లనున్నట్లు శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. ఈ అంశంపై చర్చలు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. రవిశంకర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ ఆరోపించారు. ఇప్పటికే ఈ సమస్య పరిష్కారానికి మార్గం కనిపిస్తున్నదని సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ను మధ్యవర్తిత్వం వహించమని ఎవరడిగారని నిలదీశారు.
పతంగులు ఎగరేసినట్లు కాదని వ్యాఖ్య
సుదీర్ఘ కాలం పెండింగ్లో ఉన్న అయోధ్య వివాదం పరిష్కారానికి ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ మధ్యవర్తిత్వం అవసరం లేదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పష్టంచేశారు. ఈ విషయంలో ఆయనకు ఎటువంటి అధికారమూ లేదని సోమవారం తోసిపుచ్చారు. ఇప్పటికే రవిశంకర్ మధ్యవర్తిత్వాన్ని ఆమోదించబోమని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. ఇదేమీ పతంగులు ఎగురవేసినట్లు కాదన్నారు.
‘నోబెల్' అవార్డేమీ ఇవ్వబోరని ఇలా ఎద్దేవా
ముందు గతేడాది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విధించిన జరిమానా చెల్లించిన తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మాణం సంగతి, దానిపై మధ్యవర్తిత్వం గురించి శ్రీశ్రీ రవి శంకర్ మాట్లాడాలని అన్నారు. గత ఏడాది దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో యమునా నదీ తీరాన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో మూడు రోజుల శిబిరం ఏర్పాటు చేసినందుకు రూ.5 కోట్లు చెల్లించాలని శ్రీశ్రీ రవి శంకర్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. బాబ్రీ మసీదు - రామ జన్మభూమి వివాదంలో మధ్యవర్తిత్వం వహించినందుకు ఆయనకేమీ ‘నోబెల్' బహుమతి రాబోదని అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు.