నేడే అన్నా హజారే సత్యాగ్రహం: నిరసనకారుల రైళ్ల రద్దు
Recommended Video
న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్తల అన్నా హజారే శుక్రవారం నుంచి నిరవధిక దీక్ష చేపట్టనున్నారు. దాదాపు ఏడేళ్ల క్రితం ఆయన చేపట్టిన ఆందోళన అప్పటి ప్రభుత్వాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే.
ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన దీక్షకు దిగుతున్నారు. ఆయన దీక్షష ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్లో జరగనుంది. 2011లో ఆయన ఇక్కడే దీక్ష చేపట్టారు.
నిరసనకారులతో ఢిల్లీకి వస్తున్న రైళ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని అన్నా హజారే విమర్శించారు. రైళ్లను రద్దు చేయడం ద్వారా వారు హింసకు దిగాలని అనుకుంంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. తన కోసం కూడా పోలీసు బలగాలను మోహరించారని, తనకు పోలీసు రక్షణ అవసరం లేదని స్పష్టం చేస్తూ చాలా సార్ల లేఖలు రాశానని ఆయన అన్నారు.
చట్టం ఉన్నప్పటికీ అవినీతి కేసుల దర్యాప్తునకు లోక్పాల్ను కేంద్ర ప్రభుత్వం నియమించడం లేదని ఆయన అంతకు ముందు అన్నారు. అన్నా హజారే తొలుత రాజ్ ఘాట్కు వెళ్లి అక్కడ నివాళులు అర్పించి, ఆ తర్వాత రామ్ లీలా మైదాన్కు చేరుకుంటారు.
మార్చి 23వ తేదీ బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లను ఉరి తీసిన రోజు. అందుకే తన దీక్షకు హజారే ఈ రోజును ఎంచుకున్నారు. నిరసనకు వేలాది మంది తరలివస్తారని అంటున్నారు.